Cyclone Asani: తీరం దాటిన అసని తుఫాన్.. భూమిపై నుంచి మళ్లీ బంగాళాఖాతంలోకి.. అయినప్పటికీ

|

May 12, 2022 | 7:28 AM

తుపానుగా బలహీనపడిన అసని.. రాత్రికి తీవ్ర వాయుగుండంగా మారి.. మచిలీపట్నానికి 20 కిలోమీటర్లు, నరసాపురానికి 40 కిలోమీటర్ల మధ్య తీరాన్ని దాటింది.

Cyclone Asani: తీరం దాటిన అసని తుఫాన్.. భూమిపై నుంచి మళ్లీ బంగాళాఖాతంలోకి.. అయినప్పటికీ
Asani Cyclone Live Tracking
Follow us on

Cyclon Asani Updates: అసని తుపాన్‌ రెండు రోజులుగా కల్లోలం సృష్టించింది. అసని అలజడితో తీర ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలపై తుపాన్‌ పడగ విప్పి.. భారీ నష్టాన్ని మిగిల్చింది. పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు, బలమైన గాలులకు భారీ వృక్షాలు నేలకూలాయి. వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. తుపాన్ కారణంగా తీరప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈ క్రమంలో అసని తుఫాన్‌ మచిలీపట్నం – నర్సాపురం వద్ద తీరం దాటింది. బుధవారం ఉదయానికి తుపానుగా బలహీనపడిన అసని.. రాత్రికి తీవ్ర వాయుగుండంగా మారి.. మచిలీపట్నానికి 20 కిలోమీటర్లు, నరసాపురానికి 40 కిలోమీటర్ల మధ్య తీరాన్ని దాటింది. ఇది రాత్రికి ఉత్తర ఈశాన్య దిశగా యానాం, కాకినాడ, తుని తీరాల వెంబడి కదులుతూ వాయుగుండంగా మారి మళ్లీ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ తుఫాన్‌ మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ రాత్రికి నర్సాపూర్‌ దగ్గర మళ్లీ సముద్రంలోకి ప్రవేశించనుంది.

అయితే.. తుపాన్‌ బలహీనపడినా 24 గంటలపాటు దీని ప్రభావం ఉంటుందని వెల్లడించింది వాతావరణ శాఖ. కోస్తాంధ్రలో గంటకు 70 నుంచి 90కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

వాతావరణ శాఖ అలర్ట్..

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో భారీ వర్షాలు..రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడే అవకాశముందని తెలిపింది. తుపాను తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన ప్రభుత్వం..కోస్తా తీర ప్రాంతాల్లో ప్రతీ చోటా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసింది.

విమాన సర్వీసుల పునరుద్ధరణ..

అసని తుపాన్‌ బలహీనపడటంతో విశాఖ నుంచి విమాన సర్వీసులను పునరుద్ధరించారు అధికారులు. హైదరాబాద్‌ సర్వీస్‌ను పునరుద్ధరించింది స్పైస్‌జెట్‌. ఇక సింగపూర్‌ విమానం యథావిధిగా నడపనున్నట్టు స్కూప్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది.

తీరంలో సందడి..

కాకినాడ జిల్లా ఉప్పాడ సుబ్బంపేట తీరప్రాంతం పర్యాటకులతో సందడిగా మారింది. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న కెరటాలతో యువత కేరింతలు కొడుతోంది. ఇరవై అడుగుల పైకి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రాకాసి అలలతో ఆటలాడుతున్నారు. బీచ్ రోడ్డులో ఉన్న జియోట్యూబ్ రాళ్లపై నిల్చొని ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతున్నారు.

Also Read:

Petrol, Diesel Rates Today: నిలకడగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

Viral News: రోడ్డు మీదకు జనాల పరుగులు.. ఏంటా అని చూస్తే షాక్..!