సముద్ర గర్భంలో అలజడి.. ఒడిశా పారాదీప్‌ తీరానికి ఏపీ మత్స్యకారుల బోటు.. ఆ 10 మంది క్షేమం..

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో వరుస సముద్ర ప్రమాదాలు కలవరపెడుతున్న వేళ మరో మత్స్యకార బోటు నడిసముద్రంలో ఇంజిన్‌ ఫెయిల్యూర్‌తో నిలిచిపోయింది. అయితే ఒడిశా ప్రభుత్వం, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ సిబ్బంది సమన్వయంతో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమై, బోటులో ఉన్న 10 మంది ఏపీ మత్స్యకారులు క్షేమంగా ఒడిశా పారాదీప్ తీరానికి చేరుకున్నారు. వరుసగా చోటుచేసుకుంటున్న సముద్ర ప్రమాదాల నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.

సముద్ర గర్భంలో అలజడి.. ఒడిశా పారాదీప్‌ తీరానికి ఏపీ మత్స్యకారుల బోటు.. ఆ 10 మంది క్షేమం..
Ap Fishing Boat Reaches Paradip Safely

Updated on: Jul 07, 2026 | 9:12 AM

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఇప్పుడు భయాందోళనల నీడలో కొట్టుమిట్టాడుతోంది. సముద్ర గర్భాన్ని ఆసాంతం చదివిన మత్స్యకారులు సైతం ఊహించని రీతిలో వరుస ప్రమాదాల బారిన పడుతున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే మూడు భారీ ప్రమాదాలు జరగడం తీర ప్రాంత వాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనల్లో ఒక్కరు మరణించగా.. ఆరుగురు గల్లంతయ్యారు. కాగా.. సముద్రంలో బోటు నిలిచిపోయిన ఘటనలో రెస్క్యూ పూర్తయింది.. ఏపీ మత్స్యకారుల బోటు ఒడిశా పారాదీప్‌ తీరానికి చేరుకుంది. బోటులోని 10 మంది ఏపీ మత్స్యకారులు క్షేమంగా ఉన్నారు ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో సముద్రంలో బోటు నిలిచిపోయింది. ప్రతికూల వాతావరణంలో అప్రమత్తమైన అధికారులు చర్యలు తీసుకున్నారు. ఒడిశా ప్రభుత్వం మత్స్యకారులను కాపాడింది.. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, ఫిషరీస్ సిబ్బంది కలిసి.. వారి కాపాడారు.. 10 మంది ఏపీ మత్స్యకారులను పారాదీప్ నుంచి విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

విశాఖపట్నానికి చెందిన మరో మత్స్యకార బోటు ఇంజిన్ ఫెయిల్యూర్ కారణంగా నడిసముద్రంలో నిలిచిపోయింది. అందులో ఉన్న 10 మంది మత్స్యకారులు అలల ఉధృతికి ఒడిశా వైపు కొట్టుకుపోతూ తాము ప్రమాదంలో చిక్కుకున్నామని వీడియో పంపించడంతో ఏపీ ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఒడిశా మెరైన్ పోలీసులతో పాటు, అక్కడి మత్స్యశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి వాళ్లందరినీ సురక్షితంగా రక్షించింది.

వీడియో చూడండి..

వరుసగా మూడు ప్రమాదాలు..

జూలై 1వ తేదీన విశాఖ తీరం నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారులు.. వాతావరణం అనుకూలించక జూలై 4వ తేదీన తిరిగి వస్తుండగా.. విశాఖ తీరానికి దాదాపు 10 మైళ్ల దూరంలో భారీ అలల ధాటికి బోటు బోల్తా పడింది. ఆ సమయంలో ఒక మర్చంట్ నౌక సిబ్బంది స్పందించి రెస్క్యూ ప్రయత్నాలు చేసినప్పటికీ, బోటు డ్రైవర్ చిన్నా మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. విశాఖ ఘటన జరిగిన సమయంలోనే అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం తీరంలో మరో ప్రమాదం జరిగింది. వేటకు వెళ్లిన బోటు సముద్రంలో అలల ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో నలుగురు మత్స్యకారులతో సహా తిరగబడింది. ముగ్గురు మత్స్యకారులు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరినప్పటికీ, చోడిపల్లి సింహాద్రి అనే మత్స్యకారుడు సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. అతని డెడ్‌బాడీ బంగారమ్మపాలెం తీరానికి కొట్టుకొచ్చింది. ఈ క్రమంలోనే బోటు నిలిచిపోయిన ఘటన చోటుచేసుకుంది.

Follow Us