Andhra Pradesh: ఏపీలో పెరగనున్న భూముల రిస్ట్రేషన్ ధరలు.. సర్వర్లు మొరాయించటంతో జనం పడిగాపులు

మరో రెండు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా భూముల ధరలు పెరగనున్నాయి. అయితే.. గతేడాది రేట్లు పెంచిన ప్రాంతాల్లో కాకుండా మిగిలిన చోట్ల మాత్రమే పెంచనుంది. ప్రధానంగా డిమాండ్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో రేట్ల పెంపునకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. అదేసమయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్లు మొరాయించటంతో జనం ఇబ్బంది పడ్డారు.

Andhra Pradesh: ఏపీలో పెరగనున్న భూముల రిస్ట్రేషన్ ధరలు.. సర్వర్లు మొరాయించటంతో జనం పడిగాపులు
Registration Dept

Updated on: May 29, 2023 | 9:28 PM

ఏపీలో భూముల ధరలు పెంచేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధమైంది. జులై ఫస్ట్‌ నుంచి చాలా ప్రాంతాల్లో భూముల మార్కెట్ వ్యాల్యూ పెరగనుంది. దానికి సంబంధించి జిల్లాల జాయింట్ కలెక్టర్లు ధరలు నిర్థారిస్తూ జాబితా సిద్ధం చేశారు. గతేడాది జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఒకసారి మార్కెట్ ధరలు పెంచింది ఏపీ ప్రభుత్వం. జిల్లా కేంద్రాలతోపాటు డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రేట్లు హైక్‌ చేసింది. తాజాగా మరోసారి భూముల ధరలు పెంపునకు రెడీ అయింది. అయితే.. గతంలో ఎక్కడెక్కడ ధరలు పెంచలేదో ఆయా ప్రాంతాల్లో మాత్రమే ల్యాండ్‌ రేట్లు పెరగనున్నాయి. అందులోనూ.. డిమాండ్ ఎక్కువగా ఉన్న చోటే ధరలు పెంచబోతోంది ఏపీ సర్కార్.

భూముల రేట్ల పెంపు ఒక్కో జిల్లాలో, ఒక్కో ప్రాంతంలో వేర్వేరుగా ఉండనుంది. ఆయా ప్రాంతాల్లో అధికారుల నుంచి తీసుకున్న సమాచారం మేరకు జిల్లాల జాయింట్ కలెక్టర్లు కొత్త ధరలు జాబితా సిద్ధం చేశారు. కనీసం 30నుంచి గరిష్టంగా 70 శాతం వరకూ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి.. గతేడాది జిల్లాల విభజన, భూముల ధరలు పెరుగుదలతో ఏపీ ప్రభుత్వానికి ఆదాయం దండిగా వచ్చింది. సుమారు 8 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. నెలకు సగటున 700 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈ క్రమంలోనే.. ఆదాయాన్ని మరింత పెంచుకునేలా ధరలు పెంపునకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు టాక్‌ నడుస్తోంది.

ధరలు పెంచనుండటంతో జనం క్యూ

ఇదిలావుంటే.. ఏపీలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఇటీవల తరచుగా సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. తాజాగా.. ఇవాళ కూడా ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. మరో రెండు రోజుల్లో భూముల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవడంతో ప్రజలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు క్యూ కట్టారు. అయితే.. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోని సర్వర్లు నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. సర్వర్లు మొరాయించటంతో ఏపీ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల దగ్గర జనం పడిగాపులు కాయాల్సి వచ్చింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Loading...
Unable to load recommendations.
Follow Us