Andhra News: రోడ్డు పనుల కోసం తవ్వకాలు.. మట్టికుప్పలో కనిపించిన 4 మృతదేహాలు, 9 పుర్రెలు

విశాఖ నగరం నడిబొడ్డున మృతదేహాల కలకలం రేగింది. ఆడ, మగ మృతదేహాలతో పాటు మానవ అస్థిపంజరాలు, పుర్రెలు బయటపడటం సంచలనంగా మారింది. రాత్రికి రాత్రే ఇళ్ల మధ్య ఈ మృతదేహాలు, పుర్రెలు కనిపించడంతో జనం హడలిపోయారు. ఇంతకీ, ఇళ్ల మధ్యకు మృతదేహాలు ఎలా వచ్చాయి? అసలేం జరిగింది?

Andhra News: రోడ్డు పనుల కోసం తవ్వకాలు.. మట్టికుప్పలో కనిపించిన 4 మృతదేహాలు, 9 పుర్రెలు
Human Remains And Skulls Found In Soil Trucked To Vizag

Updated on: Aug 18, 2026 | 6:17 PM

విశాఖ నగరంలో మృతదేహాలు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. రోడ్డు మరమ్మతుల కోసం మట్టిని తరలిస్తుండగా.. నాలుగు మృతదేహాలు, తొమ్మిది మానవ పుర్రెలు బయటపడటం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖలోని షీలానగర్ జంక్షన్ వద్ద పోర్టు కనెక్టివిటీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం ఇతర ప్రాంతాల నుంచి మట్టిని తరలిస్తున్నారు. ఆ మట్టిలో మానవ అస్థిపంజరాలు, పుర్రెలు కనిపించాయి. అది గమనించిన స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ మట్టిలో మృతదేహాలతో పాటు పూలదండలు, బట్టలు కూడా కనిపించడంతో ఏదైనా స్మశానం నుంచి ఈ మట్టిని తవ్వి తీసుకొచ్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లేదా రాత్రివేళ ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు ఇక్కడ పడేసి వెళ్లారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

ఇంతకీ ఈ మృతదేహాలు నగరం నడిబొడ్డుకి ఎలా వచ్చాయి? అస్థిపంజరాలు, పుర్రెల వెనుక మిస్టరీ ఏంటి? అనేది తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా, తెల్లవారుజామున నడిరోడ్డుపై అస్థిపంజరాలు, మానవ పుర్రెలు కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అటుగా వెళ్లేందుకు కూడా ఎవరూ ధైర్యం చేయలేదు. అయితే, అవి స్మశానం నుంచి తవ్విన మట్టిలో వచ్చాయని తెలియడంతో స్థానికులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us