
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తీపికబురు అందించింది. రాష్ట్రంలో చాలామంది కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పింఛన్ల కోసం దరఖాస్తు పెట్టుకోగా.. ప్రభుత్వం ఇంకా మంజూరు చేయలేదు. ప్రస్తుత కొత్త పింఛన్లను హోల్డ్లో పెట్టింది. దీంతో పింఛన్లు ఎప్పుడెప్పుడు అందుతాయా అని వేలాది మంది ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేస్తుందా అని ఎదురుచూపులు తప్పడం లేదు. అయితే ప్రభుత్వం పింఛన్ల జారీలో జాప్యం చేస్తుండగా.. ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చింది. కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది.
త్వరలోనే కొత్త పింఛన్లను పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. ఈ విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వృద్దాప్య, వితంతు కొత్త పించన్ల మంజూరుకు ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందిచామని, త్వరలోనే దరఖాస్తులు కూడా తీసుకుంటామన్నారు. కొత్తగా పించన్ కోసం అప్లై చేసుకునేందుకు త్వరలోనే అవకాశం కల్పిస్తామని అన్నారు. అర్హులైన ప్రతిఒక్కరూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క పింఛన్ కూడా ఇప్పటివరకు తొలగించలేదని, ఇంకా ఎక్కువమందికి అందించే ప్రక్రియ త్వరలో చేపడతామన్నారు. శానసమండలి సమావేశాల్లో పింఛన్ల పంపిణీపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కొండపల్లి శ్రీనివాస్ స్పష్టతిచ్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో ఒక్క వ్యక్తి పింఛన్ కూడా తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వం నిలిపివేసిన స్పాజ్ కేటగిరీ పింఛన్ విధానాన్ని కూడా తాము పునరుద్దరించినట్లు అన్నారు. వృద్దాప్య పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే తర్వాతి నెలలోనే భార్యకు పింఛన్ అందిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం 2.5 లక్షల మంది ఈ కోటాలో లబ్ది పొందుతున్నట్లు స్పష్టం చేశారు. ఒక నెలలో ఎవరైనా ఫించన్ తీసుకోకపోతే తర్వాతి నెల కలిపి రెండు ఒకేసారి ఇస్తున్నామన్నారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలో అనర్హులు ఉన్నట్లు తేలిందని, అందుకే పున:పరిశీలన చేపడుతున్నట్లు వివరించారు. ఇప్పటివరకు 1.40 లక్షల మంది అనర్హులని గుర్తించామని, వీరికి నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మరోసారి పరిశీలన చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా కొత్త ఫించన్ల దరఖాస్తుపై ఏపీ ప్రభుత్వం ఎప్పుడో ప్రక్రియ చేపట్టింది. కానీ కొన్ని సమస్యల వల్ల అది ఆగిపోయింది. త్వరలోనే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించనుండటంతో మరింతమంది లబ్దిదారులు పెరిగే అవకాశముంది. ఇక అనర్హులకు పెన్షన్ తొలగించే అవకాశముందని తెలుస్తోంది.