ఇది మా సంకల్పం.. ఇకపై మహిళలకు 33శాతం సీట్లు ఇస్తాం: మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన

టీడీపీ మహానాడు వేదికగా నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని విమర్శించిన లోకేష్.. మహిళా నాయకత్వమే భారత రాజకీయాల భవిష్యత్తు అని స్పష్టం చేశారు. “ఇది మా సంకల్పం.. ఇది మా కమిట్‌మెంట్” అంటూ చేసిన వ్యాఖ్యలు మహానాడు వేదికను మారుమోగించాయి.

ఇది మా సంకల్పం.. ఇకపై మహిళలకు 33శాతం సీట్లు ఇస్తాం: మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన
Nara Lokesh

Updated on: May 27, 2026 | 1:32 PM

అమరావతి: ‘‘పార్లమెంట్‌లో మహిళా బిల్లు పెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి.. మన స్త్రీశక్తికి మరింత బలం ఇవ్వాలని చూస్తే దానికి ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి. ఇప్పుడు ఒక ప్రతిపాదన చేస్తున్నాను. పార్లమెంట్ లో బిల్ పాస్ అయినా, అవ్వకపోయినా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి.. వచ్చే ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకు ఇవ్వాలి… ఈ పవిత్ర మహానాడు వేదిక నుంచే ఈ ప్రతిపాదన చేస్తున్నా..’’ అంటూ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, యువనేత నారా లోకేష్ ప్రకటించారు. నారా లోకేష్ ప్రవేశపెట్టిన ఈ చారిత్మాత్మక తీర్మానంతో మహానాడు వేదిక మారుమోగింది. అంతకుముందు నారా లోకేష్.. బిగ్ అనౌన్స్‌మెంట్‌ అని ఉదయం పెట్టిన ఎక్స్ పోస్టుకు అనుగుణంగా తన ప్రసంగంలో మహిళలకు రిజర్వేషన్ అంశాన్ని నారా లోకేశ్‌ ప్రకటించారు.

మహానాడు ప్రారంభం సందర్భంగా యువనేత లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో 2029 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహిళలకు 33% సీట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. ఇది కేవలం ఒక నినాదంగా కాదు.. భారతదేశ భవిష్యత్తు పట్ల ఒక నిబద్ధతగా ఉండాలన్నారు. తమకు మరింత మంది మహిళా చట్టసభ సభ్యులు కావాలని.. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును మహిళలు భుజం భుజం కలిపి నడిపిస్తారన్నారు. ఇది మా సంకల్పం.. ఇది మా బాధ్యత.. ఇది మా కమిట్మెంట్ అని అన్నారు. భారత రాజకీయాల తదుపరి శకం మహిళా నాయకత్వానిదే కావాలని తాను గట్టిగా నమ్ముతున్నానని లోకేష్ పేర్కొన్నారు.. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం ద్వారా ఎన్డీయే ఒక చారిత్రాత్మక అడుగు వేసిందన్నారు. దురదృష్టవశాత్తు, ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును తిరస్కరించి, మహిళా సాధికారతకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించాయన్నారు. ఎన్నికల సమయంలో చాలా పార్టీలు మహిళా సాధికారత గురించి మాట్లాడతాయి.. కానీ ఎన్నికల తర్వాత మహిళలను మర్చిపోతాయని ఎద్దెవా చేశారు.

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మూడు అక్షరాలు చెబితే గౌరవం దక్కుతుంది. ఆ మూడు అక్షరాల బ్రాండ్ సిబిఎన్ అన్నారు. ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని – అభివృద్ధి వికేంద్రీకరణ మన విధానం అంటూ నారా లోకేష్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వచ్చే పెట్టుబడుల్లో ఈరోజు 25శాతం ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాయన్నారు.. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, ఫైటర్ జెట్ ప్రాజెక్టులు ఏపీకి క్యూకడుతున్నాయన్నారు.

డీఎస్సీపై వైసీపీ ఆరోపణలకు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. డీఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నించిందన్నారు. డీఎస్సీని అడ్డుకోలేకపోవడంతో కొత్త డ్రామాలు మొదలుపెట్టారన్నారు. వైసీపీ కుట్రల విషయంలో అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us