
ప్రొద్దుటూరు, మే 27: సొంత కూతురిపై అఘాయిత్యానికి తల్లే సహకరించింది. బాలికపై కన్నేసిన ప్రియుడి వద్దకు బలవంతంగా తీసుకెళ్లిందా తల్లి. ఈ దారుణ ఘటన రెండు నెలల కిందట చోటుచేసుకోగా బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రొద్దుటూరులో ఈ దారుణం చోటు చేసుకుంది. సీఐ రామాంజనేయుడు కథనం మేరకు..
వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన వ్యక్తితో పులివెందులకు చెందిన మహిళ వాసుకి (పేరు మార్చం)తో 2010లో వివాహం జరిగింది. వీరికి కుమార్తె, కుమారుడు సంతానం. భర్త 2017లో కువైట్ వెళ్లగా.. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలతో కలిసి వాసుకి పులివెందులలో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో వాసుకికి పులివెందులకు చెందిన నవకిషోర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధంకి దారి తీసింది. వీరి సంబంధం భర్తకు తెలియడంతో గొడవలు జరిగాయి. దీంతో గతేడాది దంపతులు విడిపోయి విడిగా జీవిస్తున్నారు. భర్తతో విడిపోయిన తర్వాత నుంచి వాసుకి ఇద్దరు పిల్లలతో పులివెందులలో నివసిస్తుంది. అయితే వాసుకి కుమార్తెపై కన్నేసిన నవకిషోర్ తరచూ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఆ విషయం కుమార్తె తల్లి వాసుకికి చెప్పడంతో బయటికి చెబితే చంపేస్తామని బెదిరించింది.
అసలు విషయం తెలుసుకున్న వాసుకి ప్రియుడు నవకిషోర్కి బుద్ధిచెప్పడానికి బదులు మరింత సహకరించింది. ఈ క్రమంలో రెండు నెలల కిందట తన కుమార్తెను స్వయంగా నవకిషోర్ ఉన్న గదికి బలవంతంగా తీసుకెళ్లింది. అక్కడ అతడు బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో ఎలాగోలా తప్పించుకుని ప్రొద్దుటూరులోని తండ్రికి విషయం తెలిపింది. అయితే బాలిక తల్లి వాసుకి, అమ్మమ్మ, నవకిషోర్ చెల్లి స్వాతి మే 24న ప్రొద్దుటూరులోని బాలిక వద్దకు చేరుకుని తమతోపాటు రావాలని ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నవకిషోర్, అతని చెల్లి స్వాతి, బాలిక తల్లి వాసుకి, అమ్మమ్మపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.