డయేరియా నివారణకు తక్షణమే స్పెషల్ డ్రైవ్.. మంత్రి నారాయణ కీలక ఆదేశాలు..
వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులను అరికట్టేందుకై అవసరమైన అన్ని చర్యలను చేపట్టేందుకు తక్షణమే స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. మంచినీటి పైపుల్లో లీకేజీలు ఉంటే 24 గంటల్లో అరికట్టాలని, కాలువల్లో చెత్తాచెదారాన్ని జూలై నెలాఖరుకల్లా తొలగించాలని ఆదేశించారు.
వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులను అరికట్టేందుకై అవసరమైన అన్ని చర్యలను చేపట్టేందుకు తక్షణమే స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. మంచినీటి పైపుల్లో లీకేజీలు ఉంటే 24 గంటల్లో అరికట్టాలని, కాలువల్లో చెత్తాచెదారాన్ని జూలై నెలాఖరుకల్లా తొలగించాలని ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్రంలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దానికి తగ్గట్లుగా ముందస్తు నివారణ చర్యల కోసం ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని కమిషనర్లకు సూచించారు. ఇప్పటి వరకూ మున్సిపాల్టీల్లో ఎక్కడా డెంగ్యూ కేసులు రాలేదని, అక్కడక్కడా డయేరియా కేసులు మాత్రమే నమోదు అయ్యాయన్నారు.
దీనిపై వైద్యారోగ్యశాఖ అధికారులతో కూడా చర్చించారు. డయేరియా నివారణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, డ్రెయిన్లలో చెత్తను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలన్నారు. త్రాగునీటి సరఫరా పైపుల లీకేజీల నియంత్రణకు, కాలువల్లో చెత్తాచెదరాన్ని తొలగించి పారిశుధ్ద్య పరిస్థితులను మెరుగు పర్చేందుకు దాదాపు రూ.50 కోట్లను త్వరలో విడుదల చెయ్యనున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న కమిషనర్లు వారి కార్పొరేషన్లలో అమలు చేయబడుచున్న పలు కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్ల ఆర్ధిక పరిస్థితిని వివరించడంతో పాటు తాగునీరు సరఫరా మెరుగుకు, మురుగునీటి పారుదల వ్యవస్థ అభివృద్దికి, డ్రెయిన్లలో మురుగు తొలగింపుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..