
సెలవుల్లో ఆట విడుపు కోసం.. పొలంలోని నీటి కుంటలో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడటంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వ్యవసాయం కోసం తవ్విన నీటి కుంటలో లోతు తెలుసుకోకుండా ఆ ఇద్దరు విద్యార్ధులు ఈత కొట్టేందుకు ప్రయత్నించడం.. వారి ఆయువు తీసింది. ఈ విషాద ఘటన మార్కాపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ భూమిలో తవ్విన నీటి కుంటలో సరదాగా ఈతకు వెళ్ళి ఇద్దరు బాలురు మృత్యువాత పడ్డారు. మృతులు 4వ తరగతి చదవుతున్న 12 ఏళ్ళ శశి, 3వ తరగతి చదువుతున్న 10 ఏళ్ళ దీపన్ గా గుర్తించారు. ఈ రోజు స్కూల్ కు సెలవుదినం కావడంతో ఊరి పక్కన ఉన్న అరటి తోటకు సరదాగా వెళ్ళారు శశి, దీపన్లు.. నీటి కుంటలో ఈతకు దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయి ఊపిరి ఆడక మృతి చెందారు.
విషయం తెలుసుకున్న సీఐ అజయ్ కుమార్ తన సిబ్బందతో ఘటనా స్ధలానికి వెళ్ళారు. అప్పటికే విద్యార్థులు నీటి కుంటలో మృతి చెందడంతో స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీసారు. వెంటనే యర్రగొండపాలెంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే ఇద్దరు విద్యార్థులు మరణించారని వైద్యులు తెలిపారు.
దీంతో మృతుల తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పటివరకు ఇంట్లో ఆడుతూ ఆనందంగా గడిపి వెళ్లిన చిన్నారులు.. మృతి చెందడంతో ఆ చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..