విశాఖ జిల్లా మల్కాన్గిరి సింగారం ఎన్కౌంటర్పై మావోయిస్టుులు స్పందించారు. ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం పేరుతో ఆడియో టేప్ విడుదలైంది. సింగారంలో జరిగిన ఎన్ కౌంటర్ బూటకమని ఆయన ఆరోపించారు. ఏసీఎం మల్లేశ్, దళ సభ్యురాలు శాంతమ్మను పట్టుకుని కాల్చి చంపారన్నారు. ఇద్దరినీ చిత్ర హింసలకు గురి చేసి దారుణంగా హతమార్చారని మండిపడ్డారు. అలాగే పోలీసుల అదుపులో ఉన్న రాజేష్, గంగిని కోర్టులో హాజరు పర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కటాఫ్ లో హింసాత్మక పరిస్థితులు తీసుకొస్తున్నారని కైలాసం ఆరోపించారు.
కాగా, రెండు రోజుల కిందట ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. సరిహద్దుల్లోని సింగారం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా, మావోయిస్తులు తారసపడ్డారు. దీంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో మరణించిన వారిలో ఏరియా కమిటీ సభ్యుడు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో ఆయుధాలు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.