Andhra Pradesh: ముగ్గురిని చంపి, ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్.. కారణం అదేనా..?

| Edited By: Balaraju Goud

Jul 25, 2024 | 10:28 AM

తిరుపతిలో మూడు హత్యలు, ఒక ఆత్మహత్య సంచలనం రేకెత్తించింది. బుధవారం(జూలై24) రాత్రి 7:30 గంటల సమయంలో ఈ దారుణం పద్మావతి నగర్ లో వెలుగు చూసింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేస్తున్న మోహన్‌.. కొన్ని రోజులుగా గొడవలుపుడతూ ఇంట్లో గందరగోళం సృష్టిస్తున్నాడు.

Andhra Pradesh: ముగ్గురిని చంపి, ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్.. కారణం అదేనా..?
Tirupati Murders
Follow us on

తిరుపతిలో మూడు హత్యలు, ఒక ఆత్మహత్య సంచలనం రేకెత్తించింది. బుధవారం(జూలై24) రాత్రి 7:30 గంటల సమయంలో ఈ దారుణం పద్మావతి నగర్ లో వెలుగు చూసింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేస్తున్న మోహన్‌.. కొన్ని రోజులుగా గొడవలుపుడతూ ఇంట్లో గందరగోళం సృష్టిస్తున్నాడు. పెళ్లి విషయంలో కక్ష పెంచుకున్న మోహన్‌.. వదినతో తీవ్రంగా గొడవపడ్డాడు. కత్తితో వదిన పీక కోసి చంపిన అనంతరం ఆమె ఇద్దరు కూతుళ్లను కూడా అదే విధంగా చంపాడు. గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల్లో భయాందోళనకు గురిచేసిన త్రిబుల్ మర్డర్, సూసైడ్ కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అత్యంత కిరాతకంగా ముగ్గుర్ని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ మోహన్ ఉదంతం పై లోతైన దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రాథమిక విచారణలో కొన్ని నిజాలు బయటపెట్టారు. ఇష్టం లేని పెళ్లి చేసిన అన్న వదినలపై కక్ష్య నే ఈ హత్యలకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణ స్పష్టం చేస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మోహన్ కు 2019లో వివాహం జరిగింది. అయితే పెళ్లయిన నాటి నుంచి కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండగా 2021 లో మోహన్ ను భార్య వదిలేసి వెళ్లిపోయింది.

రెండేళ్లకు పైగా భార్యతో విభేదాలతో దూరంగా ఉన్న మోహన్ ఈ విషయంపై తరచూ అన్న దాస్ కుటుంబంతో ఘర్షణ పడుతూ వచ్చాడు. మోహన్ ఫ్యామిలీ మ్యాటర్‌లో పలుమార్లు పంచాయితీలు జరిగినా, సంసారం కుదుటపడకపోవడంతో మోహన్ మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆన్న పట్టించుకోవడం లేదని కసి పెంచుకున్న తమ్ముడు మోహన్ నిన్న తిరుపతిలోని పద్మావతి నగర్ ఉన్న అన్న ఇంటికి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.

సాయంత్రం 4:30 సమయంలో స్కూల్ నుంచి ఇద్దరు బిడ్డలను అన్న తులసీ దాస్ ఇంట్లో వదిలి వెళ్ళిపోయాడు. ఆ
తర్వాత ఇంటికొచ్చిన తమ్ముడు మోహన్ ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు భావిస్తున్నారు. దాస్ భార్య సునీతతో గొడవ పడ్డ మోహన్ వదిన సునీత, ఇద్దరు పిల్లలు దేవిశ్రీ, నీరజలను గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఆ తర్వాత బెడ్రూంలోకి వెళ్ళి ఫ్యాన్ ఉరి వేసుకుని మోహన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. రాత్రి 7:30 గంటల సమయంలో ఇంటికొచ్చిన దాస్ స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి ఈ దారుణాన్ని గుర్తించాడు.

ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, మోహన్ దాస్ ఇంటికి వచ్చినట్లు సిసి ఫుటేజ్ లో గుర్తించారు. ముగ్గురిని హత్య చేసి మోహన్ సూసైడ్ చేసుకోవడానికి గల అన్ని కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇష్టం లేని పెళ్లి చేశారన్న కోపమేనా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసుల ఎంక్వయిరీ జరుగుతోంది. దాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఎస్వీ మెడికల్ కాలేజీకి తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…