
మద్యం మత్తు, క్షణికావేశం కన్నపేగు బంధాన్ని తెంచేసింది. తోడబుట్టిన అన్న అని కూడా చూడకుండా గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు ఓ తమ్ముడు. క్షణికావేశానికి చిన్నపాటి చికెన్ పకోడీ గొడవ తోడవడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బ్రహ్మంగారిమఠం రజక అన్నదాన సత్రం సమీపంలో నివాసముంటున్న వెంకటసుబ్బయ్య, సురేష్లు సొంత అన్నదమ్ములు. వీరిద్దరికీ గతంలోనే పెళ్లిళ్లయినా, మద్యానికి బానిసలు కావడంతో భార్యలు వదిలి వెళ్లిపోయారు. దీంతో ఇద్దరూ తల్లి వద్దే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. రోజూ మద్యం తాగి పరస్పరం గొడవపడటం వీరికి అలవాటుగా మారింది. ఈ క్రమంలో శనివారం రాత్రి తమ్ముడు సురేష్ బయటి నుంచి చికెన్ పకోడీ తెచ్చుకున్నాడు. శనివారం పూట చికెన్ పకోడీ ఎందుకు తెచ్చావంటూ అన్న వెంకటసుబ్బయ్య తమ్ముడిని తీవ్రంగా దూషించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం చెలరేగింది.
అన్న తిట్టడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సురేష్.. ఇంట్లోని గొడ్డలి తీసుకొచ్చి వెంకటసుబ్బయ్య తలపై బలంగా నరికాడు. అంతటితో ఆగకుండా, బయటకు వెళ్లి మళ్లీ మద్యం సేవించి వచ్చి, రక్తపు మడుగులో ఉన్న అన్న గుండెలపై గొడ్డలితో మరోసారి వేటు వేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంకటసుబ్బయ్య ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేవలం చికెన్ పకోడీ వ్యవహారంలో మొదలైన గొడవ, మద్యం మత్తు తోడై ప్రాణం తీసే స్థాయికి చేరడంతో స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.