ఓ వైపు దేశం డిజిటిల్ కరెన్సీతో దూసుకుపోతుంటే..మరోవైపు సైబర్ కేటుగాళ్లు సరికొత్త పంథాల్లో ఖాతాలను కొల్లగుడుతున్నారు. మరోవైపు యాప్ లోన్ ముసుగులో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. లోన్ యాప్ ఆగడాలకు ఓ నిండు జీవితం బలైపోయింది. అప్పు …ప్రాణానికి ముప్పు… లోన్ యాప్ జోలికి వెళ్తే డెఫినెట్గా లైఫ్కు రిస్క్. లోన్ కావాలా అంటూ కుప్పలు తెప్పలుగా మెసేజ్లు పంపుతారు. ఫోన్స్ చేస్తారు. తక్కువ వడ్డీ..సులభ వాయిదాలు.. ఎలాంటి ష్యూరిటీలు కూడా అవసరం లేదంటారు. తీరా కమిటయ్యాక. ఇక చుక్కలే. ఒక్క ఈఎంఐ లేటయినా పరువుతో గేమ్స్ ఆడుతారు. వేధించి వేధించి చంపేస్తారు. చచ్చేదాక టార్చర్ పెడుతారు. ఎంతోమంది బాధితులు లోన్యాప్ ఉచ్చులో పడి ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది.
కృష్ణా జిల్లా మంటాడలో శ్రీకాంత్- సరస్వతి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఉన్నంతలో సంతోషంగా ఉండే కుటుంబం. ఐతే కొన్ని రోజులుగా ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఆ క్రమంలో సరస్వతి ఫోన్కు ఓ లోన్యాప్ నుంచి మెసేజ్ వచ్చింది. ఎలాంటి ష్యూరిటీలు లేకుండా సులభ వాయిదాలతో తక్కువ వడ్డీకే అప్పు ఇవ్వబడను అనేది సారాంశం. ఆ తరువాత ఫోన్లు కూడా వచ్చాయి. కష్టాల నుంచి గట్టెక్కడానికి ఓ దారి దొరికిందని సంతోషపడింది సరస్వతి. భర్తకు సాయపడినట్టు అవుతుందనుకుంది. 5 లక్షల లోన్ ఇస్తామన్నారు. కానీ ప్రాసెస్లో భాగంగా ముందుగా కొంత డబ్బు కట్టాలన్నారు. 20 వేలు.. 40 వేలు.. 80 వేల ఇలా విడతలవారీగా డబ్బులు వసూలు చేశారు. 5 లక్షలు వస్తాయన్న నమ్మకంతో నగలు తాకట్టు పెట్టి..అందినకాడల్లా అప్పులు చేసి డబ్బులు కట్టారామె. తనను డబ్బులు పంపమనడే కానీ ఎంతకూ వాళ్లు లోన్ మంజూరు చేయకపోవడంతో చివరకు తాను మోసపోయానని అర్ధమైందామెకు. ఎవరికీ చెప్పుకోలేక. చేసిన అప్పులు తీర్చే దారిలేక చివరకు తన జీవితాన్ని ఫనంగా పెట్టింది. బావా.. తప్పుచేశాను. మన కుటుంబం కోసమే ఈ పనిచేశాను ఆమె సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ముఖం చూపించలేక.. తనువు చాలించింది.
తమకు ఇదంతా తెలియదని వాపోయారు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు. కనీసం ఎవరికైనా ఒక్క మాట చెప్పి వుంటే బాగుండేదన్నారు. సరస్వతి ఆత్మహత్య లాంటి ఘటనను ప్రజలందరూ సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలన్నారు పోలీసులు. ఆర్థిక అవసరాల కోసం ఊరికే డబ్బులు ఎవరు ఇవ్వరని మొబైల్ ఫోన్లకి వచ్చే మెసేజ్లు ఆధారంగా లోన్స్ ఇస్తామని చెప్పే వారి మాటలు నమ్మొద్దని సూచించారు.
సరస్వతి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇలాంటి దారుణాలకు కారణం అవగాహన లేకపోవడం. ప్రతీ ఒక్కరూ సైబర్ క్రైమ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా మోసం చేస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే నిందితులను అరెస్ట్ చేయడం సహా మీ డబ్బుల్ని మీకు ఇప్పించే అవకాశాలు అంతగా ఉంటాయి. ఆందోళన పడొద్దు..జీవితాలను ఫనంగా పెట్టొద్దు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..