
ఆంధ్రా – కర్ణాటక సరిహద్దులో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.. అయినా అక్రమ మద్యం వ్యాపారులు ఎంతకు తెగించారంటే.. తమ గుట్టు రట్టు చేసిన మహిళ ఎస్సై పై దాడికి పాల్పడ్డారు. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని ఆగలి మహిళా ఎస్సై పై అక్రమ మద్యం వ్యాపారులు దాడికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపుతోంది.. అగలి మండలం ఇరిగేపల్లి గ్రామంలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో ఎస్సై శోభారాణి ఓ హోటల్ లో తనిఖీలు నిర్వహించారు.. హోటల్లో అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న విషయం గుట్టు రట్టయింది. పైకి హోటల్ గా కనిపిస్తున్నా.. లోపల బెల్ట్ షాప్ నడుపుతున్న తండ్రి మల్లికార్జున్.. కూతురు కీర్తన వ్యవహారం బట్టబయలైంది.
తండ్రీ, కూతురు అక్రమ మద్యం అమ్ముతుండగా మహిళా ఎస్సై శోభారాణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మద్యం బాటిళ్ళను.. స్వాధీనం చేసుకొని అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న తండ్రి కూతురిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లే క్రమంలో.. మహిళా ఎస్సై శోభారాణితో.. తండ్రి మల్లికార్జున్, కూతురు కీర్తన వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా యువతి కీర్తన మహిళా ఎస్సై శోభారాణి చెంప చెళ్ళుమనిపించింది. అటు తండ్రి మల్లికార్జున్ కూడా మహిళా ఎస్ఎఫ్ఐ దాడి చేసేందుకు ప్రయత్నించడంతో.. వెంటనే కానిస్టేబుల్స్ అప్రమత్తమై తండ్రీ కూతుర్ని అదుపులోకి తీసుకున్నారు.
విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా.. తనపై దాడి చేసిన మల్లికార్జున్ అతని కూతురు కీర్తన పై మహిళా ఎస్సై శోభారాణి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న గుడిబండ పోలీసులు… తండ్రి కూతుర్ని రిమాండ్ కు పంపించారు. చేసేదే అక్రమ వ్యాపారం.. పైగా పట్టుకున్న మహిళ ఎస్సై పై దాడి చేస్తే.. పోలీసులు చూస్తూ ఊరుకుంటారా..? ఏంటి అంటూ స్థానికులు పేర్కొంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..