జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఇవాళ అత్యవసర సమావేశం నిర్వహించనుంది. రాజధాని అమరావతి కోసం.. ప్రత్యక్ష ఉద్యమం చేపట్టేందుకు జనసేన సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం మిత్రపక్షం బీజేపీతో కలిసి ఉమ్మడి పోరాటాలకు పక్కా ప్లాన్లు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) కీలక సమావేశం జరగనుంది.
అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. రాజధాని అంశంపై ఉదయం రాష్ట్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాలు, అసెంబ్లీలో ప్రభుత్వ విధానాలను బట్టి.. తదుపరి కార్యాచరణను ఖరారుచేయబోతున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. దీంతోపాటుగా.. కమలదళంతో కలిసి పనిచేయడం తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీలో బీజేపీ-జనసేన పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే.రాష్ట్ర ప్రయోజనాల కోసమే రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు.. ఇరు పార్టీల నేతలు స్పష్టంచేశారు. రాబోయే స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు అన్ని చోట్లా కలిసి పనిచేస్తామన్నారు.