AP News: రాజకీయ రచ్చకు దారితీసిన వాలంటీర్ల వ్యవహారం.. టీడీపీ, వైసీపీ వాదనలు ఇలా..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రోజుకో వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదానికి దారి తీస్తోంది. ఎన్నికల కమిషన్ వేదికగా వైసీపీ, టీడీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.
![AP News: రాజకీయ రచ్చకు దారితీసిన వాలంటీర్ల వ్యవహారం.. టీడీపీ, వైసీపీ వాదనలు ఇలా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/04/issue-of-volunteers.jpg?w=1280)
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రోజుకో వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదానికి దారి తీస్తోంది. ఎన్నికల కమిషన్ వేదికగా వైసీపీ, టీడీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం వరకు ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని రెండు పార్టీలు విమర్శలు చేసుకున్నాయి. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేస్తున్నారంటూ రెండు పార్టీలు విమర్శలు చేసుకున్నాయి. ఆ తర్వాత వాలంటీర్ల వ్యవహారంపై వరుసగా ఎన్నికల కమిషన్కు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదులు చేస్తూ వస్తోంది. తాజాగా మరోసారి వలంటీర్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ ప్రతిపక్షాలు అన్నట్లు మారిపోయింది. వృద్దులను ఇబ్బంది పెట్టేలా టీడీపీ చర్యలంటున్న వైసీపీ.. కాదు, డబ్బులు లేనందునే మాపై ఆరోపణలు అంటోంది టీడీపీ. పెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు రాజకీయ దుమారాన్ని రేపాయి. టీడీపీ-బీజేపీల బినామీ సంస్థతో ఈసీకి ఫిర్యాదు చేయించడంతోనే అంతా జరిగిందనేది వైసీపీ వాదన. ఎప్పటి మాదిరిగానే పెన్షన్లు పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టాలంటూ ప్రతిపక్షాల విమర్శలతో ఎన్నికల ముందు కాకమరింత పెరిగింది.
వాలంటీర్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెంచేశాయి. సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో వాలంటీర్ల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది సీఈసీ. వాలంటీర్లపై ఎన్నికల సమయంలో ఆంక్షలు విధిస్తూ ఆదేశాలిచ్చింది. ఎలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదును వాలంటీర్లతో పంపిణీ చేయించవద్దని ఏపీ సీఈఓకు సర్కులర్ పంపింది. పెన్షన్ల పంపిణీతో సహా ఎలాంటి పథకాల్లోనూ వాలంటీర్ల జోక్యం లేకుండా చూడాలని పేర్కొంది. అంతేకాదు వారి వద్ద ఉన్న మొబైల్, ట్యాబ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఎన్నికల కోడ్ ముగిసే వరకు అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని తెలిపింది. ఆయా పథకాల పంపిణీకి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. సీఈసీ ఆదేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్దానికి దారితీశాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల నియామకం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం అందించే సామాజిక పెన్షన్లను ప్రతినెలా ఒకటో తేదీనే స్వయంగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి వాలంటీర్లు అందించేలా ఏర్పాట్లు చేసింది. సుమారు 66 లక్షల పెన్షన్ దారులకు ఇంటింటికీ వెళ్లి అందించడంతో పాటు మొదటి మూడు రోజుల్లోనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేసేలా సర్కార్ చర్యలు చేపట్టింది.
ఈసీ ఆదేశాలపై వైసీపీ వర్సెస్ ప్రతిపక్షాలు..
వాలంటీర్ల విషయంలో మొదటి నుంచీ ఏదొక ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు ఎన్నికల సమయంలో మరింత దూకుడు పెంచాయి. వాలంటీర్లు ప్రజల డేటాను తీసుకోవడంతో పాటు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఎన్నికల కమిషన్కు వరుస ఫిర్యాదులు చేశాయి. దీంతో నెల రోజుల క్రితమే ఈసీ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. అయినా ఆ తర్వాత కూడా వాలంటీర్ల విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ పేరుతో ఓ స్వచ్చంద సంస్థను స్థాపించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈ సంస్థ ద్వారా ఇప్పటికే వాలంటీర్ల విషయంలో హైకోర్టులో కేసులు వేయగా కేంద్ర ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు చేసారు. సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో రెండు రోజుల క్రితం మరోసారి వాలంటీర్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు రాజకీయ రచ్చ రాజేసాయి.
ప్రభుత్వం ద్వారా అందించే సంక్షేమ పథకాల నగదు పంపిణీకి వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని ఈసీ ఆదేశాలిచ్చింది. పెన్షన్ల పంపిణీతో సహా ఎలాంటి నగదు పంపిణీలో వాలంటీర్లు పాల్గొనకుండా ఆంక్షలు విధించింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయాల ద్వారా పెన్షన్ల పంపిణీ చేసుకోవాలని సూచించింది. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో రచ్చకు కారణమయింది. సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ సంస్ధ వెనుక టీడీపీ ఉండి ఇదంతా నడిపించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే వ్యక్తి అని.. నేరుగా టీడీపీ ద్వారా కాకుండా ఈ సంస్ధ ద్వారా వలంటీర్లపై ఫిర్యాదు చేయించారనేది వైసీపీ వాదన. ఈసీ ఆదేశాలతో ముసలివారికి ఇంటింటికీ పెన్షన్ అందించే అవకాశం ఉండదంటున్నారు. వేసవిలో క్యూలైన్లలో నిలబడి పెన్షన్లు తీసుకోవలసిన పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తున్నారు. అయితే వైసీపీ ఆరోపణలను టీడీపీ తప్పుపడుతుంది.
ప్రభుత్వం వద్ద డబ్బులు లేనందునే పెన్షన్ల పంపిణీ వాయిదా వేస్తుందని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. సొంత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందని అంటున్నారు. పెన్షనర్లను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే టీడీపీపై నెపం వేస్తున్నారనేది టీడీపీ వాదన. గతంలో మాదిరిగానే ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకుని పెన్షన్లు పంపిణీ చేయాలని కోరుతూ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు తెలుగుదేశం పార్టీ నేతలు. సచివాలయాల వద్దకు వృద్దులు ఈ ఎండలో ఎలా వెళ్తారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. ఈనెల 5 వ తేదీ లోపు పెన్షన్లు ఇంటింటికీ అందించేలా ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించాలని సీఎస్ను కోరారు. అయితే కొత్త ఆర్ధిక సంవత్సరం కావడంతో ఈనెల 3వ తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేసేలా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే రెండు పార్టీలు కూడా పెన్షనర్ల నుంచి తమకు వ్యతిరేకత రాకుండా ప్రయత్నాలు చేసుకుంటున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..