
ఏపీకి రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా ఆరు రైల్వే లైన్ల నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలు చేయగా.. త్వరలో సర్వే చేపట్టనుంది. ఈ రైల్వే లైన్లు అందుబాటులోకి వస్తే ఏపీలో రైల్వే కనెక్టివిటీ మరింత పెరగనుంది. ఏపీలోని ఇతర ప్రాంతాలతో పాటు తెలంగాణకు వెళ్లేందుకు కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి.

పల్నాడు జిల్లాలోని మాచర్ల నుంచి తెలంగాణలోని గద్వాల్ వరకు కొత్త రైల్వే లైన్ కోసం ప్రపొజల్స్ సిద్దమయ్యాయి. ఇక నెల్లూరు-రాజంపేట మధ్య కొత్త రైలు మార్గం నిర్మించాలని భావిస్తున్నారు. ఇక సామర్లకోట-చింతూరు మధ్య 150 కిలోమీటర్ల మేర కొత్త మార్గానికి కూడా ప్రతిపాదనలు రెడీ చేశారు.

కళ్యాణదుర్గం-అనంతపురం మధ్య 58 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్, గూడూరు-దుగరాజపట్నం మధ్య కొత్త లైన్కు రైల్వేశాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది. 2016లోనే ఈ మార్గానికి సంబంధించిన డీపీఆర్ సిద్దం కాగా.. ఆ తర్వాత ముందుకు కదరలేదు. ప్రస్తుతం దుగరాజపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్, షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మాణం జరుగుతుండటంతో.. కొత్త రైల్వే లైన్పై మళ్లీ కదలిక వచ్చింది.

ఇక హైదరాబాద్-మార్కాపురం కొత్త రైల్వే లైన్పై కూడా రైల్వేశాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఇది శ్రీశైలం మీదుగా వెళ్లనుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేవారికి ఇది ఉపయోగపడనుంది. శ్రీశైలంకు తరచూ హైదరాబాద్ నుంచి వేలామంది వెళ్తూ ఉంటారు. వీరికి రైలు ప్రయాణం అందుబాటులోకి రానుంది.

ఇక మాచర్ల-గద్వాల్ మధ్య నిర్మించే కొత్త రైల్వే మార్గం కీలకం కానుంది. తెలంగాణ, కర్ణాటక నుంచి ఏపీలోని పోర్ట్లకు అనుసంధానం ఉండేలా దీనిని నిర్మించనున్నారు. దీని వల్ల సరుకు రవాణాలో వేగం పుంజుకోనుంది. ఈ ఆరు రైల్వే లైన్లు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మెరుగైన ప్రయాణంతో పాటు సరుకు రవాణాకు ఉపయోగపడనుంది.