ఏపీ ఎన్నికల సంఘం కొత్త కార్యదర్శి నియామకం.. వాణీ మోహన్ స్థానంలో కన్నబాబుకు బాధ్యతలు
ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కె.కన్నబాబు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
Kanna Babu appointed Secretary of SEC : ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కె.కన్నబాబు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఉన్న వాణీమోహన్ను ఇటీవల ప్రభుత్వానికి అప్పగించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్.
పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అధికారుల కొరతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కార్యదర్శి లేకపోవడం కమిషన్ పనితీరుపై ప్రభావం చూపుతోందని, కార్యదర్శి పోస్టును భర్తీ చేసేందుకు ముగ్గురు అధికారుల పేర్లను ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఈసీ ఇటీవల లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులు రాజబాబు, విజయ్కుమార్, కన్నబాబు పేర్లను ప్రతిపాదించింది. వీటిని పరిశీంచిన ఎస్ఈసీ నిమ్మగడ్డ.. కన్నబాబును ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.