
ఏలూరు, ఫిబ్రవరి 11: ఒక్కో ప్రాంతంలో ఒక్కో కళ ఉంటుంది. స్థానికంగా లభించే వస్తువులు, ముడిసరుకు ఆధారంగా వీటి తయారీ జరుగుతుంది. అలాంటి వాటిలో ఆంధ్రప్రదేశ్లో కొండపల్లి బొమ్మలు ప్రముఖమైనవి. ఎన్నో శతాబ్దాలుగా వీటికి ప్రజల్లో ఆదరణ లభిస్తుంది. కొండపల్లి ప్రాంతంలో ప్రత్యేకంగా దొరికే పొనికి చెక్కతో ఈ బొమ్మలు తయారవుతాయి. అలాంటి కళల్లో ఒకటి శాహి ఉస్తా కళ. అయితే ఇప్పుడు ఈ కాళాకారుల బొమ్మల తయారీ ప్రమాదంలో పడిందట. అసలు ఈ కళ ఏంటి? వాటి ప్రత్యేకత ఏంటో? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
శాహి ఉస్తా కళ రాజస్తాన్ రాష్ట్రంలోని బికనీర్ ప్రాంతానికి చెందిన ఒక ప్రత్యేకమైన హస్త కళ. రాజమహల్ గోడలు, కోటల అలంకరణ, సింహాసనాలు, కత్తులుతో మొదలైన ఈ కళ క్రమేణా ఒంటె చర్మాలపై చేయటం వరకు చేరుకుంది. దీన్ని అత్యున్నత నైపుణ్యం గల కళాకారుల కళగా పరిగణిస్తారు. అందుకే ఇందులో ఉస్తా (ఉస్తాద్) పదం కలిసి ఉంటుంది. బికనీర్ ఎడారి ప్రాంతం కావటంతో అక్కడ ఒంటెలు ఎక్కువగా ఉండేవి. దీంతో వాటి చర్మాన్ని కళాఖండాల తయారీలో వినియోగించేవారు. ఒంటె చర్మాన్ని శుభ్రపరిచి , పలచగా చేసి కావాల్సిన ఆకారంలో మలుస్తారు. ముఖ్యంగా ఇవి దీపాలు, డబ్బాలు, అలంకరణ పాత్రల రూపంలో ఉంటాయి. సున్నితమైన ఆకృతులతో ప్రత్యేకమైన ముద్రలు ఎంబోసింగ్ చేస్తారు.
వీటికి ఎరుపు, ఆకుపచ్చ, నీలం వంటి కాంతివంతమైన రంగులు, బంగారు పూత వేస్తారు. ఒక చిన్న కళాఖండం తయారయ్యేందుకు సుమారు 15 రోజుల సమయం పడుతుందంటే కళాకారుల శ్రమ ఎంత ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం బంగారం ధరలు పెరగటం, ఒంటె చర్మం దొరకకపోవడంతో పాటు అమ్మకాలు సైతం తగ్గిపోవటంతో శాహి ఉస్తా కళాకారులు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నారు. ఒకప్పుడు వందల సంఖ్యలో ఉన్న కళాకారుల సంఖ్య ప్రస్తుతం 10లోపు చేరుకుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శాహి ఉస్తా కళ వారసత్వం ప్రతిబింబించేవిధంగా ప్రదర్శన జరగటంతో దేశవ్యాప్తంగా మరోసారి గుర్తింపు లభించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.