ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు, వర్షాలు కలిసి విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 45-46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
Weather Report

Updated on: May 30, 2026 | 7:07 AM

తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం కనిపిస్తోంది. కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుంటే, మరికొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. వెరసి రెండు రాష్ట్రాల్లో హుమిడిటీ పెరిగి ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీవ్రమైన ఎండలతోపాటు.. పిడుగుల కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో కూడిన విభిన్న వాతావరణ పరిస్థితులు మరో రెండు రోజులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఆదివారం నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందన్నారు.

శనివారం (30-05-2026) 11 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.

వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నమోదైయ్యే మండలాల పూర్తి వివరాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి..:

శనివారం గరిష్ట ఉష్ణోగ్రతలు..

పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 45 – 46 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

విజయనగరం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 – 44 డీగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 40 – 42 డీగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఉపరితల ఆవర్తనం..

మరోవైపు నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉందని ఏపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. దీనిప్రభావంతో శని, ఆదివారాల్లో అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, హోర్డింగ్స్ క్రింద నిలబడొద్దని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకుని వెళ్లాలని కోరారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

తెలంగాణలో వర్షాలు

తెలంగాణలో సైతం వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎండలతోపాటు.. పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Follow Us