
పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం వద్ద భవఘ్ని ఆరామం ఉంది. ఈ ఆశ్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మూడు రోజుల క్రితం నర్సరావుపేటకు చెందిన ఒక వృద్దురాలు భవఘ్ని ఆశ్రమానికి వెళ్లటానికి వైకుంఠపురానికి బస్సులో వచ్చింది. అక్కడ బస్సు దిగిన వృద్దురాలు భవఘ్ని ఆశ్రమానికి నడిచి వెళ్లేందుకు సిద్దమై కొద్దిదూరం నడిచి వెళ్లింది. అయితే అప్పటికే ఆమెను గమనించిన యువకుడు.. బైక్పై సర్రున దూసుకొచ్చాడు. హెల్మెట్ ధరించి వేగంగా బైక్ నడుపుకుంటూ వచ్చిన యువకుడు ఆ వృద్దురాలి మెడలో ఉన్న బంగారు గొలుసు తెంపుకొని అంతే వేగంగా వెళ్లిపోయాడు. చెయిన్ స్నాచింగ్ జరగడంతో ఆ మహిళ గట్టిగా కేకలు వేసింది. ఆమె కేకులు విన్న స్థానికులు జరిగిన విషయాన్ని తెలుసుకొని ఆ బైక్ వెంట పడ్డారు. కొద్ది దూరం వారి నుంచి తప్పించుకున్న చెయిన్ స్నాచర్ తప్పనిసరి పరిస్థితుల్లో బైక్ వదిలేసి పొలాల్లోకి పారిపోయాడు.
ఆ గ్రామం చుట్టూ క్రిష్ణా నది ప్రవహిస్తుండటం ఆ యువకుడు పొల్లాల్లోకి పరుగులు తీయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. గ్రామంలోని ఫోటోగ్రాఫర్ని సంప్రదించి అతని వద్దనున్న డ్రోన్ తీసుకున్నారు. చెయిన్ స్నాచర్ పారిపోయిన పొలాల వైపు ఫోటోగ్రాఫర్ సాయంతో డ్రోన్ ఎగుర వేశారు. కొద్దిసేపు డ్రోన్లో వెదికిన తర్వాత డ్రోన్ కెమెరాకి యువకుడు చిక్కాడు. వెంటనే అతన్ని ఫాలో అయి స్థానికులు పట్టుకున్నారు. చెయిన్ స్నాచర్కు దేహశుద్ది చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. బైక్ నంబర్, యువకుడు ఆధారాలు సేకరించిన పోలీసులు అతన్ని నాగార్జునగా గుర్తించారు. గుంటూరు సమీపంలోని జొన్నలగడ్డకు చెందిన వ్యక్తిగా తేల్చారు. ప్రస్తుతం అతని గత నేరచరిత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఏమైనా చెయిన్ స్నాచింగ్ కేసులున్నాయా లేదా అని ఆరా తీస్తున్నారు. బైక్ అతనిదేనా లేక చోరి చేసినదా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. స్థానికులు అప్రమత్తమయి డ్రోన్ సాయంతో దొంగ కదలికలను గుర్తించి పట్టుకోవడంపై ప్రసంశల జల్లు కురుస్తుంది. పోలీసులు కూడా స్థానికులను అభినందించారు. డ్రోన్ సాయంతో చెయిన్ స్నాచర్ ఆట కట్టించడంతో ఆ వృద్దురాలు కూడా సంతోషం వ్యక్తం చేసింది.