బాబు పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది..’మావిగన్‌’ అజెండాతోనే ఎన్నికలకు: వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా’ స్థానంలో ‘రూల్ ఆఫ్ ఫియర్’ (భయాందోళనల పాలన) నడుస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం (జూలై 01) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన కీలక మీడియా సమావేశం నిర్వహించి, చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలను ఎండగట్టారు.

బాబు పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది..మావిగన్‌ అజెండాతోనే ఎన్నికలకు: వైఎస్ జగన్
Ys Jagan

Updated on: Jul 01, 2026 | 1:14 PM

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా’ స్థానంలో ‘రూల్ ఆఫ్ ఫియర్’ (భయాందోళనల పాలన) నడుస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం (జూలై 01) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన కీలక మీడియా సమావేశం నిర్వహించి, చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలను ఎండగట్టారు.

విజయవాడ పరిధిలో జరిగిన సాయికృష్ణ, క్రాంతికమార్ మరణాలపై జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “పోలీస్ కస్టడీలోనే నిర్బంధించి చంపేసి, కనీసం కుటుంబ సభ్యులకు మృతదేహం బూడిద కూడా ఇవ్వకుండా మాయం చేశారన్నారు. కృష్ణలంక పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘోరాలపై సీపీ, డీజీపీలు బాధ్యులు కారా?” అని ప్రశ్నించారు. ఈ కేసుల్లో నేరాన్ని కప్పిపుచ్చడానికి మే 1 నుంచి జూన్ 1 వరకు పీఎస్ సీసీటీవీ ఫుటేజీలను డిలీట్ చేశారని, క్లౌడ్ సర్వర్ల ఫుటేజీలను సిట్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నిలదీశారు. అమరావతిలో భూములు ఇవ్వని రైతుల పక్షాన నిలిచిన వైఎస్సార్‌సీపీ నేతలపైనే దాడులు చేసి, తిరిగి వారిపైనే తప్పుడు కేసులు పెడుతూ బాధితులనే నిందితులుగా మారుస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఆక్వా, మామిడి, పొగాకు రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని జగన్ ఆరోపించారు. తాము తెచ్చిన ‘అప్సడా’ (APSADA) చట్టాన్ని బేఖాతరు చేస్తూ కంపెనీలు సిండికేట్‌గా మారి ఫీడ్ ధరలను కిలోకు రూ.14-16 పెంచి, రొయ్యల ధరలను క్రాష్ చేశాయన్నారు. కర్ణాటక ప్రభుత్వం కేంద్ర సహాయంతో తోతాపురి మామిడిని కిలో రూ.17.50 చొప్పున కొనుగోలు చేస్తుంటే, చంద్రబాబు మాత్రం లేఖ రాయడంలో తీవ్ర ఆలస్యం చేశారన్నారు. తన వారైన గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్ వంటి బినామీ కంపెనీల ప్రయోజనాల కోసమే బాబు తాత్సారం చేశారని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యలపై కలిసి వచ్చే ఏ శక్తులతోనైనా అండగా నిలిచి పోరాడుతామని మాజీ సీఎం జగన్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము ‘మావిగన్’ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) కారిడార్ అజెండాతోనే ప్రజల ముందుకు వెళ్తామని ప్రకటించారు. రాబోయే ఎన్నికల సమరం ప్రధానంగా “మావిగన్ వర్సెస్ అమరావతి” మధ్యే ఉంటుందని జగన్ వ్యాఖ్యానించారు. శూన్యం నుండి అమరావతిని నిర్మించడానికి లక్షల కోట్లు ఖర్చవుతుందని, ఇది రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసే భ్రమ అని ఆయన విమర్శించారు. దానికి బదులు, ఇప్పటికే ఎయిర్‌పోర్ట్, పోర్టు, జాతీయ రహదారుల వంటి మౌలిక సదుపాయాలు ఉన్న 110 కిలోమీటర్ల ‘మావిగన్’ ప్రాంతాన్ని రాజధాని కారిడార్‌గా మార్చడమే అత్యంత ఆచరణాత్మకమైన పరిష్కారమని జగన్ పునరుద్ఘాటించారు.

అంతేకాదు ఎస్ఐఆర్ (SIR) పేరుతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే పెద్ద కుట్ర జరుగుతోందని, చంద్రబాబు అవినీతిని, అరాచకాలను ప్రశ్నిస్తే సొంత మీడియాతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని జగన్ తీవ్రంగా ఆక్షేపించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us