ఒకానొక టైంలో రాష్ట్రమంతా మాట్లాడుకున్న పేరు.. జోగి రమేష్. ఆయన భాష చూసి వైసీపీ నాయకులే ముక్కన వేలేసుకున్న సందర్భాలు బోలెడు. జోగి రమేష్ మాట్లాడిన బూతులు విని.. ఎంతైనా ఇంతలా శృతిమించకూడదని అనుకున్న వైసీపీ నేతలు ఎంతోమంది ఉన్నారు. అసెంబ్లీ కదా అని ఆగలేదు.. బహిరంగ సభ అని చూడలేదు.. ప్రెస్మీట్లలోనూ తగ్గలేదు.
అప్పటి వరకు అడపాదడపా నోరు పారేసుకుంటున్నా అంత పేరు రాలేదు గానీ.. ఎప్పుడైతే చంద్రబాబు ఇంటిపైకి వెళ్లారో అప్పటి నుంచి రాష్ట్రం మొత్తం జోగి రమేష్ పేరు మారుమోగిపోయింది. అప్పట్లో పొలిటికల్ సర్కిల్లో చెప్పుకున్నదేంటంటే.. చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లడమే జోగి రమేష్కు మంత్రి పదవిని కట్టబెట్టిందని కూడా అనుకున్నారు. కొడాలి నాని స్థానంలో జోగి రమేష్ను తీసుకురాబోతున్నారని ఆనాడే మాట్లాడుకున్నారు. కనీసం 40, 50 కార్లేసుకుని.. వందలాది అనుచరులను వెంటేసుకొని.. కరకట్ట మీదుగా చంద్రబాబు ఇంటిపైకి వెళ్లారు. అయ్యన్న చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉంటే.. అయ్యన్న నివాసం వద్ద నిరసన చేపట్టాలి. లేదా ఆయన ఇంటిని ముట్టడించాలి. కాని, జోగి రమేష్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఈ ఇన్సిడెంట్ తరువాతనే జోగి రమేష్కు మంత్రి పదవి వచ్చింది. అయినా సరే.. ఎక్కడా హుందాగా వ్యవహరించలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు.
సాక్షాత్తు వైఎస్ జగన్ సమక్షంలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్, రఘురామకృష్ణరాజును నానా మాటలు అన్నారు. అమరావతిలోని R-5 జోన్లో పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు శంకుస్థాపన చేసిన సందర్భంలో.. కేవలం జోగి రమేష్కు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆ క్రమంలో ప్రాస కోసం పాకులాడారో.. అలవాటులో పొరపాటో గానీ.. పవన్ కల్యాణ్ పార్టీలను మార్చుతారు.. డ్యాష్డ్యాష్ అంటూ మాట్లాడారు. అప్పట్లో ఇదే అతిపెద్ద సంచలనం. మరీ దారుణమైన బూతు
పోనీ.. అసెంబ్లీలో అయినా మాట జారకుండా ఉన్నారా అంటే.. అదీ లేదు. ఆయన మాట్లాడిన మాటల్లోని కొన్ని పదాలు ప్రజలకు వినిపించకుండా బీప్లు వేయాల్సిన పరిస్థితి. అంత దారుణమైన బూతులు మాట్లాడారు.
ఇక ప్రెస్మీట్లలోనూ అదే వరస. మాట్లాడితే చంద్రబాబు, పవన్ కల్యాణ్ పేర్లు తీస్తూ దారుణంగా విమర్శించే వారు. కనీస గౌరవం లేకుండా ఏకవచన సంభోదనే. అధికారంలో ఉన్నాం, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం అన్న సోయి లేకుండా మాట్లాడేవారు. చంద్రబాబు ఇంటి మీదకు కేవలం వినతిపత్రం ఇవ్వడానికే వెళ్లానని ఇవాళ అంటున్నారు కదా. కాని, మంత్రిగా ఉన్నప్పుడు ఏమనే వారో తెలుసా. ఒకసారి ప్రెస్మీట్లో నారా లోకేష్ను విమర్శిస్తూ.. ‘నేను నీ ఇంటికే వచ్చా.. మీ నాన్ననే ఉరికించాం.. నువ్వెంత’ అని కామెంట్ చేశారు.
చంద్రబాబు అంటే కేవలం కుప్పం ఎమ్మెల్యేనే అనుకున్నారేమో. కాదు. అపోజిషన్ లీడర్ అయినా సరే ఎన్ఎస్జీ భద్రత ఉన్న పొలిటీషియన్. అలాంటి నేత ఇంటిపై దాడి చిన్న కేసు కాదు. అధికారంలో ఉన్నంత వరకు ఆ కేసు తెరపైకి రాలేదు. ఇప్పుడు అధికారం మారింది కాబట్టి ఒక్కో కేసు బయటకు తీస్తున్నారు. ఈ కేసులో కచ్చితంగా అరెస్ట్ అవుతానని, 3 నెలల తరువాత బయటికొస్తానని కొన్ని వారాల ముందే ఒప్పుకున్నారు జోగి రమేష్.
రాజకీయంగానూ జోగి రమేష్ తప్పటడుగులే వేశారంటారు రాజకీయ విశ్లేషకులు. తనది మైలవరం నియోజకవర్గం అని చెప్పుకుంటారు గానీ.. అక్కడ ఒక్కసారి కూడా గెలిచింది లేదు. తన నియోజకవర్గం కాకపోయినా.. పెడన నుంచి పోటీ చేస్తే 2009, 2019లో గెలిపించారు అక్కడి ప్రజలు. అయినా సరే.. మైలవరంలో రాజకీయాలు చేశారు. మైలవరంలో జోగి రమేష్ జోక్యాన్ని వైఎస్ జగన్ సైతం చూసీచూడనట్టు ఉండడం వల్లే వసంత కృష్ణప్రసాద్ పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఆ నియోజకవర్గంలో వైసీపీ డిస్టర్బ్ అవడానికి ప్రధాన కారణం ఎవరని అడిగితే.. అన్ని వేళ్లూ జోగి రమేష్ వైపే చూపిస్తాయి. పైగా పెడనపై జోగి రమేష్ ఫోకస్ పెట్టకపోవడంతో ఆ నియోజకవర్గం నుంచి పెనమలూరుకు మార్చారు. మొత్తంగా ఈ మూడు నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఓడిపోయింది. ఇందుకు కారణం ఎవరయా అని ప్రశ్నిస్తే.. మళ్లీ జోగి రమేష్ వైపే వేళ్లు చూపిస్తున్నారు వైసీపీ నేతలు.
ఇక.. జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ గురించి. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రాజీవ్ను అరెస్ట్ చేశారు. ఇంతకీ.. ఏంటీ అగ్రిగోల్డ్ భూమి రగడ..? ఏసీబీ దర్యాప్తు అధికారులు చెప్పేదేంటంటే.. అగ్రిగోల్డ్ స్కామ్లో భాగంగా సర్వే నెంబర్-87 భూమిని సీఐడీ అటాచ్ చేసింది. సీఐడీ అటాచ్ చేశాక.. దీన్ని ఎవరూ కొనడానికి వీల్లేదు. ఈ సర్వే నెంబర్-87 పక్కనే.. ఎలాంటి వివాదాలు లేని సర్వే నెంబర్-88లో భూమిని కొన్నారు జోగి రాజీవ్ అండ్ ఆయన బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు. కొద్ది రోజుల తర్వాత సర్వే నెంబర్ తప్పు పడిందంటూ 88వ నెంబర్ను 87వ నెంబర్గా మార్చుకున్నారు. కొన్ని నెలల తర్వాత అదే స్థలాన్ని వైసీపీ కార్పొరేటర్కి అమ్మేశారు. ఇలా అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేశారనేది ఏసీబీ అభియోగం. సీఐడీ అటాచ్ చేసిన భూములు ఎవరైనా కొంటారా అనేది జోగి రమేష్ వర్షన్ అయితే.. జోగి రాజీవ్ మాత్రం ‘అందరూ ఎలా కొన్నారో తామూ అలాగే కొన్నాం’ అంటూ మాట్లాడారు. అంటే.. తెలిసీ అగ్రిగోల్డ్ భూములు కొన్నారా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్.
తన కుమారుడు రాజీవ్ అమాయకుడని జోగి రమేష్ చెబుతున్నారు గానీ.. పెనమలూరు ఎన్నికల ప్రచారంలో రాజీవ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదని చెబుతుంటారు టీడీపీ నేతలు. మీసాలు మెలేసి ‘దమ్ముంటే చూసుకుందాం రండి’ అని సవాలు చేయడాన్ని ఇప్పటికీ మరిచిపోలేదంటున్నారు. జరిగినవన్నీ గమనిస్తున్న కూటమి పెద్దలు.. కర్మ రిటర్న్స్ అంటే ఇదే కాబోలు అని మాట్లాడుకుంటున్నారు. అటు ప్రభుత్వం కూడా ఎలాంటి తొందరపాటు చర్యలకు పోవడం లేదు. పూర్తి ఆధారాలు దొరికిన తర్వాతనే.. న్యాయపరంగా తప్పించుకోలేని విధంగా దిగ్బంధనం చేసిన తర్వాతనే.. అరెస్టుల జోలికి వెళ్తున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని పరిణామాల కారణంగా.. జోగి ఫ్యామిలీ మొత్తం ఇరకాటంలో పడినట్టైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..