Amaravati: అమరావతి చట్టబద్ధతకు లైన్ క్లియర్.. మోదీ సర్కార్ కీలక నిర్ణయం..

అమరావతి చట్టబద్ధత బిల్లుకు క్లియరెన్స్ ఇచ్చింది కేంద్ర హోంశాఖ. నాలుగు కేంద్ర శాఖలు అభిప్రాయం అనంతరం.. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం తెలపనుంది. ఈ బిల్లుతో కూటమి ప్రభుత్వానికి కలిగే ప్రయోజనం ఏంటి..? అమరావతి బిల్లుపై పార్లమెంటులో వైసీపీ స్టాండ్ ఏవిధంగా ఉండనుంది..? అనేది తెలుసుకుందా..

Amaravati: అమరావతి చట్టబద్ధతకు లైన్ క్లియర్.. మోదీ సర్కార్ కీలక నిర్ణయం..
Parliament To Pass Bill For Amaravati Legal Validity

Updated on: Jan 31, 2026 | 7:43 AM

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్దతకు లైన్ క్లియర్ అయింది. ఈ ఫైల్‌కు కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. ఇక న్యాయశాఖ, పట్టణాభివృద్ధిశాఖలతో పాటు మరో రెండు శాఖల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది అమరావతి రాజధాని బిల్లు. కేంద్ర కేబినెట్‌ ఆమోదం అనంతరం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతుంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్ర రాజధానిగా ఏ ప్రాంతం ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాధికారం. ఇందుకు అనుగుణంగా అమరావతిని ఎంపిక చేసి, 2014లో భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఏపీలో పాలనా మార్పుతో జాప్యం జరిగింది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో అమరావతి పక్కకు పోయి మూడు రాజధానుల అంశం తెరమీదికి వచ్చింది.

మళ్లీ 2024లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో మరోసారి అమరావతిని రాజధానిగా ప్రకటించి పూర్తి స్థాయి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరింది.ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా.. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని టీడీపీ కోరింది. విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటురెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉంది. 2024 జూన్‌ 2తో ఉమ్మడి రాజధాని గడవు ముగియడంతో ఏపీకి ప్రత్యేక శాశ్వత రాజధానిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏ తేదీ నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ కోరింది. 2024 జూన్‌ 2న హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా గడవు ముగిసినందున..ఆరోజు నుంచే అమరావతిని రాజధానిగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరింది రాష్ట్రప్రభుత్వం. దీంతో విభజన చట్టానికి నోడల్‌ ఏజన్సీగా ఉన్న కేంద్ర హోం శాఖ అమరావతిని రాజధానిగా ప్రకటించేందుకు చర్యలు మొదలు పెట్టింది. అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి హోం శాఖ అభిప్రాయలు కోరింది.

గత ప్రభుత్వం తెచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతిపై గందరగోళం ఏర్పడింది. దీంతో భవిష్యత్తులో రాజకీయ మార్పులు వచ్చినా రాజధాని మారకుండా ఉండాలంటే పార్లమెంట్ చట్టబద్ధత ఉండాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ బిల్లు ఆమోదం పొందితే ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదానికి శాశ్వత పరిష్కారం లభించినట్లే. ఎన్డీఏ ప్రభుత్వానికి ఉభయసభల్లో పూర్తి మెజారిటీ ఉండటంతో బిల్లు ఆమోదం లాంఛనమే. అయితే ఈ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు..వైసీపీ ఎటువైపు స్టాండ్ తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.