
దేవుడిని భక్తితో కొలుస్తాము. కష్టాలు తీర్చమని.. కన్నీళ్లు తుడువమని వేడుకుంటాము. కొందరు తలనీలాలు సమర్పించుకుంటామని మొక్కుకుంటారు. లేదంటే ఆర్ధికంగా కలిగిన వారు దేవాలయ అభివృద్ధికి కానుకలు సమర్పిస్తామని దేవుడికి చెప్పుకుంటారు. సమస్యల నుంచి బయటపడితే.. అనుకున్నవిధంగా మొక్కులు చెల్లించుకుంటారు. కానీ నాకు ఇది చేస్తే.. నేను నీకు అది చేస్తాను అని ఎవరైనా భగవంతుడికి లెటర్ రాస్తారా..? అలా ముందస్తు అగ్రిమెంట్ చేశాడో భక్తుడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో వెలుగుచూసింది.
దేశవ్యాప్తంగా శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. శివరాత్రికి ఉపవాసాలు ఉండి, జాగారాలు చేసిన భక్తులు తమ శక్తి కొద్ది భగవంతుడికి కానుకలు సమర్పించుకున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలోని శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి వారి ఆలయం లోనూ శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన హుండీ లెక్కింపులో ఓ ఉత్తరం బయట పడింది. ఓ విద్యార్థి మంచి మార్కులు వచ్చి.. సంవత్సరానికి 20 లక్షల రూపాయలు ప్యాకేజీ జాబ్ వస్తే అభిషేకం చేసి.. నూతన వస్త్రాలు సమర్పిస్తానని ఒక తెల్ల పేపర్పై రాసి హుండీలో వేశాడు. ప్రస్తుతం ఈ లేఖ వైరల్ అవుతుంది. దీంతో పాటు ఇటీవల జరిగిన పరీక్షల్లో 9 CGPA అంటే సుమారు 85%–86% రావాలని దేవుడిని కోరుకున్నాడు.
భక్తుడిని మనసులో తలుచుకుని కోరికలు కోరుకోమని పూజల సమయంలో అర్చకులు చెబుతారు. అలా చేస్తే భగవంతుడు ఆలకిస్తారనేది విశ్వాసం. అయితే ఇటీవల కాలంలో హుండీల్లో వెలుగు చూస్తున్న లేఖలు ఆసక్తికరంగా ఉండి చర్చలకు తెరదిస్తున్నాయి. హైందవ సంప్రదాయంలో కొబ్బరి కాయ కొట్టే విధానం నుంచి, తలనీలాలు భక్తులు సమర్పించుకోవడం వరకు ప్రతి దానికి ఒక రీజన్ ఉంది. కానీ జెన్ Z తరానికి భక్తి ఓ కోడింగ్లా మారి భగవంతుడికి ఆఫర్స్ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది.
Read: నాటు కోళ్లకు ఈ ఆకులు వేస్తే.. అసలు వైరస్ అన్నదే రాదు..