వెలుగుల పండుగ దీపావళిని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్లో ఆనందోత్సాహాల నడుమ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. నగరవ్యాప్తంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుతూ వేడుకలు చేసుకున్నారు.
వరంగల్లోనూ పండుగ జోష్ కనిపించింది. టపాసుల ధరలు ఎక్కువగా ఉన్నా ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి సంబరాలు చేసుకున్నారు. వరంగల్ నగరమంతటా వెలుగులు నిండాయి.
కరీంనగర్లో బీజేపీ నేత బండి సంజయ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. కరీంనగర్లోని కార్ఖాన గడ్డ హిందూ శ్మశానవాటికలో తమ పూర్వీకుల సమాధుల వద్ద పూజలు చేసి బాణాసంచా కాల్చారు.
దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఊరూవాడ సందడి నెలకొంది. విజయవాడలో దీపావళి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. మహిళలు దీపాలు వెలిగించడంతో పాటు ఆనందోత్సాహాలతో బాణాసంచా కాల్చారు.
ఏలూరు, కాకినాడలో పండుగను సంప్రదాయబద్దంగా జరుపుకున్నారు. రాజమండ్రిలో బాణాసంచా విక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి.
తిరుపతిలో నరకాసుర వధ కార్యక్రమాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు.