
అనంతపురం శివారులోని SK యూనివర్సిటీ సమీప పరిసరాల్లో పదుల సంఖ్యలో కాకులు చనిపోతున్నాయి. అలాగే వనమిత్ర అటవీ ఉద్యాన పరిసరాల్లో కూడా… పావురాలు చనిపోయిన సంఘటనలు గడిచిన నాలుగు రోజులుగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల వరుసగా కాకులు, పావురాలు మృత్యువాత పడటంతో… SK యూనివర్సిటీలోని వృక్ష, జంతు శాస్త్ర ప్రొఫెసర్ రవిప్రసాద్ కాకులు, పావురాల మృతిపై వెటర్నరీ అధికారులకు ఫిర్యాదు చేశారు. బర్డ్ ఫ్లూ మాదిరిగానే, ఇన్ఫ్లూయెంజా వైరస్ కారణంగా కాకులు చనిపోతున్నాయని ప్రొఫెసర్ భావించారు. ఇన్ఫ్లూయెంజా వైరస్తో చనిపోయిన కాకులను ముట్టుకుంటే శ్వాస కోశ సమస్యలు.. కళ్ల కలకలు వస్తాయంటున్నారు ప్రొఫెసర్ రవి ప్రసాద్. అయితే ఇన్ఫ్లూయెంజా వైరస్, బర్డ్ ఫ్లూ లాంటి లక్షణాలు లేవని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. చనిపోయిన కాకులు, పావురాల రక్త నమూనాలను సేకరించి… భోపాల్ లోని ల్యాబ్ పంపించామన్నారు వెటర్నరీ డాక్టర్ రవిబాబు. చనిపోయిన కాకులు, పావురాలు SK యూనివర్సిటీలోని క్యాంటీన్ లో మిగిలిపోయిన ఆహార పదార్థాలు పారేసినప్పుడు… ఆ పదార్థాలు ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల… అదే ఆహారాన్ని తిన్న కాకులు, పావురాలు చనిపోయి ఉంటాయని వైద్యాధికారులు అనుమానిస్తున్నారు… ప్రజలు ఎవరు అపోహలు పెట్టుకోవద్దని… ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వెటర్నరీ వైద్యులు… ల్యాబ్ రిపోర్టు వచ్చాక… కాకులు, పావురాల మృతిపై ఒక క్లారిటీ వస్తుందంటున్నారు వెటర్నరీ అధికారులు… ఏది ఏమైనా గడిచిన కొద్ది రోజులుగా వరుసగా పదుల సంఖ్యలో కాకులు మృత్యువాత పడటం స్థానికంగా… కలకలం రేపుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.