
లండన్లో అతిపెద్ద విద్యుత్ సరఫరాదారు సంస్థగా ఉన్న ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ సంస్థను.. ఏపీలోని పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అమరావతి, విశాఖలలో నూతన టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా నియంత్రణ రంగంలో పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని సంస్థ ప్రతినిధులకు సీఎం వివరించారు. క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో ఏపీలో పని చేసేందుకు అవకాశాలు ఉన్నాయని ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులకు స్పష్టం చేశారు.160 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేలా ఏపీ లక్ష్యం పెట్టుకుందని సీఎం చంద్రబాబు తెలిపారు.అలాగే ఏపీలోని విద్యుత్ రంగంలో ప్రభుత్వ పాలసీలు, ఈ రంగంలో ఏపీ నిర్దేశించుకున్న మన లక్ష్యాలను సంస్థ ప్రతినిధులకు సీఎం వివరించారు. రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
రూ.20వేల కోట్ల పెట్టుబడులకు హిందుజా గ్రూప్తో కుదిరిన ఒప్పందాలు
అనంతరం హిందుజా గ్రూప్ భారత చైర్మన్ అశోక్ హిందుజా, యూరప్ లోని హిందుజా గ్రూప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజా, హిందుజా రెన్యువబుల్స్ ఫౌండర్ శోమ్ హిందుజాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. ఏపీలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వారికి వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన హిందూజా గ్రూప్ తో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దశలవారీగా ఏపీలో రూ.20 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని హిందూజా గ్రూప్ నిర్ణయం తీసుకుంది.
విశాఖలో ఉన్న హిందుజా పవర్ ప్లాంట్ సామర్ధ్యాన్ని మరో 1,600 మెగావాట్ల ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్ లను ఏర్పాటు చేసే అంశంపై ఒప్పందం, కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ ఏర్పాటు అంశంపై కూడా ఒప్పందాలు కుదిరాయి. ఈ తాజా ఒప్పందాలతో ఏపీలో గ్రీన్ ట్రాన్స్ పోర్ట్ ఎకో సిస్టంను అభివృద్ధి చేసేలా హిందూజా గ్రూప్ సహకరించనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.