
మూడు రాజధానుల వ్యవహారంపైన సీఎం జగన్ తేల్చి చెప్పారు. అన్నీ ఆలోచించిన తరువాతనే విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంపిక చేసామని స్పష్టం చేశారు. అదే సమయంలో సీఎం ఎక్కడి నుంచి అయినా పాలన చేయవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం జగన్ తన అభిప్రాయాలను మరోసారి వివరించారు. సీఎం ఎక్కడ నుంచి పాలన చేస్తే అక్కడే సహచర మంత్రులు ఉంటారని.. అక్కడే సచివాలయం ఉంటుందని తేల్చి చెప్పారు. సీఎం ఎక్కడి నుంచి పాలన చేయాలనే విషయాన్ని మిగతావారు ఎలా నిర్ణయిస్తారని జగన్ ప్రశ్నించారు. అర్ధిక అనుకూలత-పరిపాలనా సౌలభ్యం కోసమే విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంపిక చేసామని వివరించారు.
వికేంద్రీకరణ స్పూర్తిగా విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంచుకున్నామని చెప్పారు. 5 నుంచి 10 వేల కోట్లు ఖర్చు చేస్తే విశాఖ అద్భుత రాజధానిగా మారుతుందన్నారు. అలాగే తనకు అమరావతి మీద ఎటువంటి కోపం లేదన్నారు జగన్. ఇష్టం లేకుంటే అమరావతిలో శాసన రాజధాని ఎందుకు ప్రకటిస్తామని, అక్కడే శాసన వ్యవస్థలు ఉంటాయని చెప్పారు. ఇక కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని వెల్లడించారు. అమరావతి అటు గుంటూరు.. ఇటు విజయవాడకు 40 కిలో మీటర్ల దూరంలో ఉందని, అక్కడ ఎటువంటి మౌళిక వసతులు లేవని పేర్కొన్నారు. ఎకరానికి ఏ స్థాయిలో ఖర్చు చేస్తే మౌళిక వసతులు ఏర్పడుతాయో గతంలోనే చంద్రబాబు వివరించారని, ఆ లెక్కన లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినా పూర్తి స్థాయి రాజధానిగా మార్పు చెందటం కష్టమని వివరించారు.
అమరావతి రాజధానిగా ప్రకటనకు ముందే చంద్రబాబు మద్దతుదారులు, సన్నిహితులు భూములు కొనుగోలు చేసి ఇన్ సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని.. రాజధాని కోసం కాదని, రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు మద్దతు దారులు ఆందోళన చెందుతున్నారని సీఎం జగన్ ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..