Andhra: నో టాలరెన్స్.. తప్పు చేస్తే శిక్ష తప్పదు.! పుట్టా మహేష్ డ్రగ్స్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్

పార్టీలోని వందమంది నాయుకుల్లో ఒక్కరు తప్పు చేసినా అది పార్టీకే మరక. అలాంటి మరకు అంటకుండా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ గల నేతల్లా ఉండాలన్నది ఆపార్టీ అధినేత మాట. నో టాలరెన్స్..తప్పు చేస్తే శిక్ష తప్పదన్న వార్నింగ్ గతంలోనే ఇచ్చారాయన. అయినా సరే ఇప్పుడో నేత తప్పు చేశారు. మరి పార్టీ రియాక్షన్ ఏంటి..?

Andhra: నో టాలరెన్స్.. తప్పు చేస్తే శిక్ష తప్పదు.! పుట్టా మహేష్ డ్రగ్స్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్
Ap Cm Chandrababu

Updated on: Mar 16, 2026 | 7:34 AM

నో టాలరెన్స్..ఇది ఏపీ సీఎం చంద్రబాబు తమ నాయకులకు తరచూ చెప్పిన మాట. జనంలో ఉండండి. జనం మాట వినండి .జనంతోనే నడవండి. అంటూ సందేశమిస్తూనే, నాయకులు పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోనని గతంలోనే హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో ఘటన టీడీపీలో కలకలం రేపింది. వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ పార్టీ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. అర్ధరాత్రి నిర్వహించిన యాంటీ నార్కోటిక్స్‌ దాడిలో పలువురు ప్రముఖులు పట్టుబడగా… వారిలో ఎలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. టెస్టులో డ్రగ్స్ పాజిటివ్ రావడంతో టీడీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే టీడీపీ స్పష్టమైన సందేశం ఇచ్చింది. డ్రగ్స్‌ వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలగకూడదన్న ఉద్దేశంతో పుట్టా మహేష్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ క్రమశిక్షణ విషయంలో మాత్రం రాజీ ఉండదన్న సంకేతాన్ని చంద్రబాబు మరోసారి యాక్షన్‌లో చూపించారు.

ఈ వ్యవహారంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అధికారికంగా షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. డ్రగ్స్‌ కేసుతో సంబంధం ఉన్నట్టు వచ్చిన సమాచారం నేపథ్యంలో ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో స్పష్టం చేశారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రవర్తన ఏదైనా జరిగితే కఠిన చర్యలు తప్పవని కూడా అందులో పేర్కొన్నారు. రాజకీయంగా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా… పార్టీ నియమాలు అందరికీ ఒకటేనన్న సందేశం ఇవ్వడమే లక్ష్యంగా టీడీపీ అధిష్టానం ఈనిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తానెలాంటి తప్పుచేయలేదంటున్నారు పుట్టమా మహేష్.

గతంలో కూడా వివాదాల్లో ఇరుక్కున్న నేతలపై చంద్రబాబు కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఎంత దగ్గర నాయకులైనా… పార్టీ ప్రతిష్ఠకు మచ్చ పడితే చర్యలు తప్పవని ఆయన పలుమార్లు ప్రకటించారు. గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో వివాదంలో ఇరుక్కున్న కోనేటి ఆదిమూలం వ్యవహారం కూడా అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే పార్టీ కార్యకలాపాల నుంచి ఆయనను దూరంగా ఉంచారు. ప్రస్తుతం పుట్టామహేష్ అంశంపై విపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. వెంటనే సస్పెండ్ చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. మరి చూడాలి పుట్టా వివరణ తర్వాత టీడీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Follow Us