పాలాభిషేకాలు.. పూలాభిషేకాలు పాత స్టైల్.. నయా ట్రెండ్ లోకి రక్తాభిషేకం వచ్చి చేరింది. ఇప్పుడు బుద్ధా వెంకన్న ఈ ట్రెండ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లారు. చంద్రబాబు కటౌట్కు రక్తాభిషేకం చేసి సంచలనం సృష్టించారు. విజయవాడ వెస్ట్ టికెట్పై పట్టువీడని బుద్ధా వెంకన్న ఇవాళ రక్తాభిషేకం చేశారు. తన రక్తంతో చంద్రబాబు కటౌట్ పాదాలకు అభిషేకం చేశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.. తన రక్తంతో CBN జిందాబాద్.. అని రాయడంతోపాటు.. నా ప్రాణం మీరే అంటూ కూడా క్యాప్షన్ యాడ్ చేశారు. ఇది చంద్రబాబుపై తనకున్న అభిమానం అని ప్రకటించారు. చంద్రబాబుకు తనకంటే ఎక్కువ విధేయుడు ఎవరు ఉంటారంటూ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. అన్ని అర్హతలు ఉన్న తనకు విజయవాడ వెస్ట్ టికెట్ ఇవ్వాలి లేదంటే అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని బుద్దా వెంకన్న ప్రాధేయపడ్డారు. ఇది విన్నపం మాత్రమే అన్న బుద్దా వెంకన్న ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. నా రక్తంతో చంద్రబాబు కాళ్లు కడిగాను.. ఇంతకన్నా అభిమానం ఇంకొకటి ఉంటుందా అని ప్రశ్నించారు.
చంద్రబాబుపై తనకున్న ప్రేమ, బాధ తెలియడానికే విజయవాడ అర్జున వీధిలో ఇలా రక్తాభిషేకం చేశానంటున్నారు బుద్దా. చంద్రబాబు నాకు దేవుడు, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శించను అని ప్రకటించారు. విజయవాడ వెస్ట్ నుంచి తనను తప్పించాలని కేశినేని నాని పట్టుబడుతూ వచ్చారంటూ మండిపడ్డారు. పోరాటం చేసే వారిలో నేను ఒక బ్రాండ్ అంటూ ప్రకటించుకున్నారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయి, విధేయులను కాపాడుకోవాల్సిన అవసరం పార్టీకి ఉందన్నారు బుద్దా వెంకన్న.
తనకు టికెట్ ఇవ్వకపోయినా అధినేతను ఎవరైన విమర్శిస్తే ఊరుకోను అని హెచ్చరించారు బుద్దా వెంకన్న. చంద్రబాబును బ్లాక్మెయిల్ చేసినా, బెదిరించినా పుట్టగతులు లేకుండా పోతారంటూ శాపనార్థాలు పెట్టారు. చంద్రబాబు రాజు, మేమంతా సైనికులం అంటున్నారు బుద్ధా వెంకన్న. మొత్తానికి తనదైన శైలిలో చంద్రబాబుపై భక్తిని చాటుకున్నారు బుద్దా వెంకన్న. టికెట్ ఇవ్వాలన్నది విజ్ఞప్తి. ఇవ్వకపోయినా విమర్శలకు దిగబోనంటూ స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే.. బెజవాడ వెస్ట్ టికెట్ కోసం బుద్ధా వెంకన్న, జలీల్ఖాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీతో టికెట్ తనకే ఇవ్వాలంటూ బుద్ధా వెంకన్న పలుమార్లు బల ప్రదర్శన నిర్వహించారు. ఇటీవలే తన నివాసం నుంచి దుర్గ గుడి వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అంతేకాకుండా.. అధినేతకు తనకంటే వీరవిధేయుడు ఎవరు ఉంటారని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే.. ఇవాళ రక్తంతో చంద్రబాబు పాదాలకు అభిషేకం చేశారు.. ఐతే.. బుద్ధాకు టికెట్ ఇవ్వడాన్ని జలీల్ ఖాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బుద్ధాకు కార్పొరేటర్ స్థాయి కూడా లేదని గతంలో జలీల్ఖాన్ విమర్శలు చేశారు. తనకు సీటు ఇవ్వకపోతే ఉరేసుకుంటానంటూ ఓ దశలో వివాదాస్పద కామెంట్ చేసి వెంటనే మాట సరిదిద్దుకున్నారు జలీల్ఖాన్.. విజయవాడ వెస్ట్లో బుద్ధా, జలీల్ఖాన్ మధ్యలో పోటీ ఇలా ఉంటే ఇక్కడే పోతిన మహేష్ పేరు కూడా తెరపైకి వ్చింది… పొత్తులో వెస్ట్ టికెట్ తనకు వస్తుందని పోతిన మహేష్ ధీమాగా ఉన్నారు. ఈ ఫైట్ నేపథ్యంలోనే ‘నాకేం తక్కువ అంటూ’ బుద్ధా ప్రెస్మీట్ పెట్టి ప్రశ్నించారు.
విజయవాడ పశ్చిమ స్థానం తనకు ఇవ్వడం సాధ్యం కాదనుకుంటే అనకాపల్లి ఎంపీ స్థానమైనా ఇవ్వాలని బుద్ధా వెంకన్న ఇప్పటికే పలుమార్లు కోరారు. అయితే.. ఇటు MLA సీటు కానీ, అటు MP సీటు కానీ ఎలా చూసినా పొత్తులో జనసేనకే ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బుద్ధా వెంకన్న ఇలా బలప్రదర్శనలు, రక్త తర్పణాలు అనడం.. ఎమోషనల్గా అధినేతను బ్లాక్మెయిల్ చేయడమే అనే మాట కూడా వినిపిస్తోంది. విజయవాడ వెస్ట్కి పోతిన మహేష్ పోటీ పడుతున్నట్టే.. అనకాపల్లి టికెట్ కోసం జనసేన నుంచి పవన్ సోదరుడు నాగబాబు, కొణతాల రామకృష్ణతోపాటు TDP నుంచి చింతకాయల విజయ్ లాంటివాళ్లు.. కర్చీఫ్ వేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ వెస్ట్లో కావచ్చు, అనకాపల్లి MP విషయంలో కావచ్చు.. బుద్ధా వెంకన్న ప్లాన్ ఏంటనేదే ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..