
ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమకు రతనాల సీమ అని పేరుంది. కృష్ణదేవరాయల కాలంలో వజ్రాలను రాసులుగా పోసి అమ్మేవారని చరిత్రలో చదువుకున్నాం. ఆ ఆనవాళ్లు ఇప్పటికీ అప్పుడప్పుడూ బయటపడుతున్నాయి. పేరుకు తగ్గట్టుగానే అక్కడ కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ వజ్రాలు దొరుకుతున్నాయి. తొలకరి చినుకులు పడగానే ఈ వజ్రాలకోసం ఉదయం నుంచి సాయంత్రం వరకూ స్థానికులు పంటపొలాల్లో అన్వేషిస్తారు. చాలాసార్లు చాలామందికి వజ్రాలు దొరికిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ వజ్రాల వేట సాధారణంగా కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా జరుగుతుంది. తాజాగా విజయవాడలోనూ వజ్రాల వేట సాగుతోంది. ఇటీవల ఓ వ్యక్తికి నీలిరంగు వజ్రం దొరికిందని సమాచారం. దీంతో స్థానికులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలవారు కూడా గుడిమెట్ల ప్రాంతానికి తరలి వస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్ల ప్రాంతంలో ఓ కుటుంబానికి ఓ వజ్రం దొరికింది. అది నీలిరంగు వజ్రంగా గుర్తించారు. దాని బరువు 4 క్యారెట్ల వరకూ ఉంటుందని అంచనా వేశారు. ఎన్నో ఏళ్లుగా ఆ కుటుంబం ఆ ప్రాంతంలో వజ్రాల వేట కొనసాగిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ వజ్రం దొరికిందని, వజ్రం లభించగానే ఆ కుటుంబం అక్కడినుంచి వెళ్లిపోయిందని స్థానికులు చెబుతున్నారు. రాజుల కాలంలో గుడిమెట్ల రాజధానిగా ఉండేదట. అక్కడ రాజుల కోట కూడా ఉండేదని అంటున్నారు. గతంలోనూ ఇక్కడ వజ్రాలు దొరికాయని, ఇప్పుడు మళ్లీ వజ్రం దొరకడంతో ఈ ప్రాంతానికి స్థానికులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలనుంచి కూడా జనం వజ్రాన్వేషణ కోసం వస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడి మట్టి గుట్టల్లో.. పొలాల్లో వజ్రాలకోసం అన్వేషిస్తున్నారు. ప్రత్యేకంగా వాహనాలు కట్టించుకొని మరీ ఆ ప్రాంతానికి వచ్చి వజ్రాలను గాలిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..