
New Scam: మోసానికి కాదు ఏది అనర్హం అంటే ఇదేనేమో. పంట రుణాలు, పర్సనల్ లోన్లు , గోల్డ్ లోన్.. లేదా ఆస్తి తాకట్టు రుణాలు.. ఇలాంటివి మనం చూస్తున్నాము. కానీ పశువుల పేరుతో కూడా రుణాలు ఇప్పిస్తామని ఎక్కడైనా విన్నారా..? అవును నిజమే. ఇది నంద్యాల జిల్లాలో వెలుగు చూసింది. ఈ మోసం ఆరేళ్లుగా జరుగుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. చివరకు పోలీసులు కూడా.. నంద్యాల జిల్లా ఆత్మకూరు , నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలో వర్ధన్ కో-ఆపరేటివ్ సొసైటీ పేరుతో వ్యవసాయ రుణాలు తోపాటు పాడి రుణాలు కూడా ఇప్పిస్తామని మోసం జరుగుతోంది. ట్రాక్టర్లకు భూములకు వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు రుణాలు ఇప్పిస్తానంటూ కోట్ల రూపాయలు వసూలు చేశారు.
ఇదంతా ఇంతకు ముందే బయటకు వచ్చింది. కానీ ఇదే సొసైటీలోని ఓ ఉద్యోగి కాటం బాబు మరో మోసానికి తెర తీశాడు. సాధారణంగా పల్లెల్లో దాదాపు ఎక్కువ శాతం ఇళ్లకు పశువులు ఉంటాయి. బర్రెలు ఆవులు ఇలా ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారి దగ్గరికి వెళ్లి వాటిపై రుణాలు తీసుకోవచ్చని ఆశ పెట్టాడు. మొదట్లో కొందరికి ఇప్పించాడు కూడా. అందరూ నమ్మడంతో పెద్ద ఎత్తున కాట బాబు చుట్టూ తిరిగారు.
రుణం కావాలంటే ముందుగా కొంత మొత్తం చెల్లించాలని పెద్ద ఎత్తున ఇప్పించుకున్నాడు. తర్వాత రుణం ఇప్పించకుండా ముఖం చాటేసాడు. బాధితుల సంఖ్య వేళల్లో పెరిగిపోయింది. శాతనకోట, ముచ్చుమర్రి ,మిడుతూరు గ్రామాల్లో బాధితులు ఎక్కువ శాతం ఉన్నారు. ఇలా నలవై లక్షల పైగా బాధితుల నుంచి పాడి రుణాల పేరుతో వసూలు చేశారు. న్యాయం చేయాలంటూ గత ఆరేళ్లుగా బ్రాహ్మణ కొట్టుకూరు, నందికొట్కూరు, ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ల చుట్టూ బాధితులు తిరుగుతూనే ఉన్నారు. బాధితుడి ఫ్లెక్సీ పట్టుకుని నిన్న అంటే ఈ నెల 11న పోలీస్ స్టేషన్ ముందు బాధితులు చేసిన ధర్నా ఆందోళన తో పోలీసుల్లో కదలిక వచ్చింది. నిందితుడు బాబు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలా పశువుల పేరు చెప్పి రుణాలు ఇప్పిస్తామని ఎవరైనా వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి