
అవకాడో సాగు ప్రస్తుతం మన దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక వ్యవసాయ విధానం. ప్రపంచవ్యాప్తంగా సౌత్ అమెరికా, ఆఫ్రికా దేశాల రైతులను కోటీశ్వరులను చేసిన ఈ పంటను గ్రీన్ గోల్డ్ అని పిలుస్తారు. దీని అధిక లాభదాయకత కారణంగా ఒక సంవత్సరపు పంట ఒక రైతును కోటీశ్వరుని చేసిన సందర్భాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. తెలుగులో వెన్న పండు అని పిలువబడే అవకాడో, తెలుగు రాష్ట్రాలలో ఇటీవల కాలంలో కొనుగోలులు అధికమయ్యాయి. రానున్న నాలుగు నుంచి ఆరు సంవత్సరాలలో ప్రతి ఇంట్లో అవకాడో వినియోగం సాధారణం కావచ్చు. భారతీయ ట్రాపికల్ వాతావరణం అవకాడో సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటుంది, మంచి ఉత్పత్తిని అందిస్తుంది. అయితే, కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవకాడో మొక్కలను నీళ్లు నిల్వ ఉండే పొలాలలో పెంచకూడదు. వీటికి నీటి అవసరం చాలా తక్కువగా ఉంటుంది. మట్టిలో ఆమ్ల స్థాయి (pH) ఐదు నుంచి ఏడు మధ్య ఉండాలి. ఉప్పు నీరు ఉండే ప్రాంతాలలో అవకాడో సాగు కష్టంగా ఉంటుంది.
సాగు విధానంలో భాగంగా, అవకాడో విత్తనాలను నేరుగా పొలంలో నాటకూడదు. ముందుగా విత్తనాలను నర్సరీ బ్యాగులలో సుమారు ఆరు నెలల పాటు పెంచాలి. ఆ తర్వాత పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. పొలంలో కలుపు లేకుండా చూసుకొని, ఒకటికి రెండుసార్లు దుక్కి దున్ని భూమిని సాగునుగా చేయాలి. పొలం నిండా ఎరువును తోలించుకొని మళ్ళీ దుక్కి దున్నడం వల్ల భూసారం పెరుగుతుంది. మొక్కలు నాటుకునేటప్పుడు 90 సెంటీమీటర్ల లోతు గుంటలు తవ్వి, అందులో కొంచెం వానపాముల ఎరువు లేదా ఘనజీవామృతం వేసి మొక్కలను నాటుకోవాలి. మొక్కకి మొక్కకి సుమారు 20 అడుగుల దూరం ఉండాలి. ఒక ఎకరానికి 140 నుంచి 160 మొక్కలను నాటుకోవాల్సి ఉంటుంది. మొక్కలను భూమిలో నాటగానే ఒక్కో మొక్కకు సుమారు లీటరు నీటిని అందించాలి. ఆ తర్వాత మూడు నుంచి నాలుగు వారాలకు ఒకసారి నీళ్లు ఇచ్చినా సరిపోతుంది. అవకాడోకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టంను అమర్చడం వల్ల మంచి దిగుబడి వస్తుంది. మొక్కలను నాటుకున్నాక కనీసం ఐదు సంవత్సరాల పాటు పంట కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవకాడో కాయలు కాయడం మొదలుపెడతాయి. ఒక్కో అవకాడో కాయ సుమారు అర కిలో బరువు ఉంటుంది. ఏడు సంవత్సరాల నుంచి ఒక్కో చెట్టుకు సుమారు 200 కిలోల కాయలు కాస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ గ్రేడ్ రకం కాయల ధర కిలో రూ.80 గా ఉండగా, ఏ గ్రేడ్ రకం అయితే కిలో రూ.150 వరకు అమ్ముడవుతోంది. నాణ్యతను బట్టి కొన్ని ప్రాంతాలలో కిలో రూ.250 కి కూడా అమ్ముతున్నారు. అవకాడో సాగులో సంవత్సరానికి ఒక ఎకరంలో రూ.20 లక్షల నుండి రూ.40 లక్షల దాకా ఆదాయం పొందవచ్చు.
ఈ పంటకు ఎక్కువ ఎరువులు, పురుగుమందులు అవసరం లేదు, కాబట్టి అధిక ఖర్చుల నుంచి తప్పించుకోవచ్చు. మన దేశంలో ప్రస్తుతం ఎక్కువ శాతం అవకాడోలను తమిళనాడు, కర్ణాటక, సిక్కిం, మహారాష్ట్రలో పండిస్తున్నారు. సంవత్సరానికి సుమారు లక్ష రూపాయలలోపే ఖర్చుతో.. దాదాపు అరకోటి ఆదాయాన్ని పొందగలిగిన అద్భుతమైన సాగు అవకాడో. అయితే, రైతులు అవకాడోల గురించి మరిన్ని విషయాలను పూర్తిగా తెలుసుకొని మాత్రమే పండిస్తే బెటర్. చల్లగా ఉండే ఎత్తైన ప్రాంతాలు, నీరు బాగా డ్రెయిన్ అయ్యే నేల అయితే అవకాడో సాగుకు బాగుంటుంది.
Also Read: అక్కడ పది రోజుల పాటు చికెన్, ఎగ్స్ తినకపోవడం మంచిది..