APSRTC: ఏపీ ప్రజలపై మరో భారం.. ఆర్టీసీ ఛార్జీలపై డీజిల్ సెస్ విధింపు

|

Apr 13, 2022 | 6:25 PM

ఏపీ ప్రజలపై మరో భారం పడింది. బస్సు ఎక్కే సామాన్య ప్రయాణీకులకు గురువారం నుంచి వాయింపు ఉండనుంది. టికెట్ రేట్లపై డీజిల్ సెస్ విధిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

APSRTC: ఏపీ ప్రజలపై మరో భారం.. ఆర్టీసీ ఛార్జీలపై డీజిల్ సెస్ విధింపు
Apsrtc
Follow us on

ఊహించిందే జరిగింది. రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలపై డీజిల్ సెస్ విధిస్తున్నట్లు APSRTC ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. డీజిల్ ధరల పెరగుదలతో ఈ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. టికెట్ ధర పెంపు లేదని, డీజిల్ సెస్ మాత్రమే విధిస్తున్నట్లు వెల్లడించారు. అయితే పల్లె వెలుగు బస్సు టికెట్ కనీస ధర రూ.10గా నిర్ణయించారు. ఇక ఎక్స్‌ప్రెస్ బస్సు చార్జీలపై రూ.5 డీజిల్ సెస్ విధించారు. పల్లెవెలుగు బస్సులపై రూ.2 డీజిల్ సెస్ విధించారు. హైఎండ్ బస్సులకు 10 రూపాయలు సెస్ విధిస్తున్నట్లు వెల్లడించారు.  పెంచిన ధరలు గురువారం (ఏప్రిల్ 14) నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా డీజిల్ సెస్ వల్ల ఏడాదికి రూ.720 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని APSRTC ఎండీ తెలిపారు. సామాన్య ప్రజలు ఎక్కువగా ప్రయాణించేది పల్లె వెలుగులోనే. వాటి కనీస చార్జీని పది రూపాయలకు పెంచడం పేదలకు భారం కానుంది.

ఆర్టీసీ.. రోజుకు 61 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోందని.. రెండేళ్లుగా ఆర్టీసీకి అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని వెల్లడించారు. రెండేళ్లులో సంస్థకు రూ.5,680 కోట్ల ఆదాయానికి గండి పడిందన్నారు. పెట్రో ధరలు, టైర్లు, ఇతర పరికరాల ధరలు కూడా బాగా పెరిగాయని తెలిపారు. 2019 డిసెంబర్‌లో డీజిల్ ధర రూ.67 ఉందని.. ఇప్పుడు రూ.107కు పెరిగిందన్నారు. డీజిల్ బల్క్ ధర ఎక్కువగా ఉందని.. రీటైల్‌గా తీసుకుంటున్నట్లు వివరించారు. పొరుగునున్న టీఎస్ఆర్టీసీ కూడా డీజిల్ సెస్ విధించిందని.. సంస్థపై భారాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.

Also Read: Hyderabad: పరుపుల మాటున పత్తి యాపారం.. తెలిస్తే బిత్తరపోవడం ఖాయం