
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఇది రాబోయే 48 గంటల్లో తన దిశను మార్చుకుని ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీనికి తోడు తమిళనాడు నుంచి మహారాష్ట్ర వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ప్రభావం కూడా ఏపీపై బలంగా ఉంది.
ఉత్తర కోస్తా ఆంధ్ర – యానాంలో ఇవాళ వాతావరణం పొడిగా ఉంటుంది. ఒకటి లేదా రెండు చోట్ల తెల్లవారుజామున పొగమంచు కురిసే అవకాశం ఉంది. సోమవారం వాతావరణంలో మార్పులు వచ్చి, అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో మూడు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం కూడా ఉండవచ్చు. రాయలసీమ జిల్లాల్లో రాగల మూడు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులో ప్రస్తుతానికి పెద్దగా మార్పులు ఏవీ ఉండబోవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే గాలుల దిశ మార్పు వల్ల రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో చలి ప్రభావం కంటే పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వర్ష సూచన నేపథ్యంలో రైతులు తమ కోతకు వచ్చిన పంటలను భద్రపరుచుకోవాలని, వాహనదారులు పొగమంచు సమయంలో ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలని సూచించడమైనది.