AP Weather Alert: సుర్రుమంటున్న సూరీడు.. ఇవాళ ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ హెచ్చరికలు!

AP Weather today: రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం మార్కాపురం జిల్లా కంభంలో 45.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డైనట్లు పేర్కొన్నారు..

AP Weather Alert: సుర్రుమంటున్న సూరీడు.. ఇవాళ ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ హెచ్చరికలు!
Heatwave Alert To Andhra Pradesh

Updated on: Apr 28, 2026 | 6:46 AM

అమరావతి, ఏప్రిల్ 28: మొత్తం 28 జిల్లాలకు గాను 20 జిల్లాల పరిధిలోని 227 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఏకంగా 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. మంగళవారం (ఏప్రిల్ 28) అధిక ఉష్ణోగ్రతలతో పాటు 19 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 21 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. మరోవైపు రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమొరిన్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.

నేడు 19 మండలాల్లో తీవ్రవడగాల్పులు

విజయనగరం జిల్లాలో బాడంగి, బొబ్బిలి, రామభద్రాపురం, తెర్లాం, వంగర మండలాలు
పార్వతీపురంమన్యం జిల్లాలో బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట,పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో (19) తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు.

సోమవారం మార్కాపురం(జి) కంభంలో 45.7°C, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు(జి) కొమ్మిపాడులో 45.1°C, అమరావతిలో 44.2°C, ప్రకాశం (జి) కొప్పెరపాడులో 44.8°C, తిరుపతి (జి) బేస్తపల్లి, వైఎస్సార్ కడప (జి) వీరబల్లిలో 44.2°C, నంద్యాల (జి) ఆళ్లగడ్డలో 44°C, అన్నమయ్య (జి) నూలివీడులో 43.1, చిత్తూరు (జి) తవణంపల్లెలో 43°C, కర్నూలు (జి) కల్లూరు, ఎన్టీఆర్ (జి) తొర్రగుడిపాడు 42.7°C, కాకినాడ (జి) కరపలో 42.4°C, శ్రీసత్యసాయి (జి) ముడిగుబ్బ 42.3°C, మన్యం (జి) బూర్జ, అనంతపురంలో 42.2°C, శ్రీకాకుళం (జి) కొత్తూరు, విజయనగరం (జి) రాజాంలో 41.7°C, బాపట్ల (జి) మార్టూరులో 41.6°C, అనకాపల్లి (జి) దేవరపల్లెలో 41.5 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని, ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బిపి ఉన్నవారు ఎండలో తిరగడం శ్రేయస్కరం కాదని హెచ్చరించారు. దాహం వేసినా వేయకపోయినా క్రమం తప్పకుండా తగినంత నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని, బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వేడి గాలి చెవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కళ్ల రక్షణ కోసం తప్పనిసరిగా సన్ గ్లాసెస్ ధరించాలని ఆయన కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us