AP Panchayat Elections 2021: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు పార్టీల మధ్య పోరాటంగా సాగుతున్నాయి. ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది మొదలు జిల్లాల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణ పడుతున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం కిష్టపల్లిలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల ఘర్షణ ఉద్రిక్తంగా మారింది. పోలింగ్లో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఓటర్లను వైసీపీ కార్యకర్తలు ప్రలోభపెడున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు పోలింగ్ కేంద్రం దగ్గరకు చేరుకున్నారు.
కృష్ణా జిల్లా నిమ్మకూరు పోలింగ్ కేంద్రంలో వివాదం తలెత్తింది. అధికార, విపక్ష పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకోవడం వివాదం సద్దుమణిగింది.
కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వృద్ధులను పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లే విషయంలో వాగ్వాదం తలెత్తింది. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు.
ప్రకాశం జిల్లా కొనకనమిట్ట మండలం బోడపాడులో పోలింగ్ ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థి కమలాకర్ బైఠాయించారు. దీనిపై టీడీపీ అభ్యర్థి ప్రవీణ్ అభ్యంతరం తెలిపారు. ఇరువర్గాల మధ్య మొదలైన వాగ్వాదం తోపులాటకు దారి తీసింది. బోడపాడులో రీపోలింగ్ జరగాల్సిందేనని టీడీపీ అభ్యర్థి డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో దొంగ ఓట్లు కలకలం రేపాయి. ఒకరికి బదులు మరొకరు ఓట్లు వేస్తున్నారంటూ అభ్యర్థులు ఆరోపించుకున్నారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఇరుపార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది. నరసరావుపేట మండలం పమిడిపాడులో కూడా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ పోలీసులు జోక్యంతో సద్దుమణిగింది.
నెల్లూరు జిల్లా ఎస్ పేట మండలం చిరమనలో ఉద్రిక్తత తలెత్తింది. పోలింగ్ కేంద్రాల దగ్గర వైసీపీ, టీడీపీ వర్గాలు బాహాబాహీకి దిగాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.
Rinku Sharma Murder: భజరంగ్దళ్ కార్యకర్త రింకు శర్మ హత్య కేసు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్కు బదిలీ