బీసీలకు అదిరిపోయే శుభవార్త.. స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్‌..! ప్రభుత్వానికి చేరిన నివేదిక

ఏపీలోరి బీసీ ప్రజలకు కూటమి సర్కార్ త్వరలోనే అదిరిపోయే శుభవార్త చెప్పబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పన హామీని అమలు దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా, బీసీల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసిన డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను సమర్పించింది. కమిషన్ సిఫార్సుల ఆధారంగా త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

బీసీలకు అదిరిపోయే శుభవార్త.. స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్‌..! ప్రభుత్వానికి చేరిన నివేదిక
Andhra Pradesh Local Body Elections

Edited By:

Updated on: Aug 14, 2026 | 2:35 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కూటమి ప్రభుత్వ హామీ అమలుకు మరో కీలక అడుగు పడింది. రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా.. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్‌ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ సిఫార్సులపై ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

హామీ నుంచి అమలు దిశగా

ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన ప్రధాన హామీల్లో 34 శాతం రిజర్వేషన్‌ ఒకటి. స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచేలా ఈ రిజర్వేషన్లు అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అయితే రిజర్వేషన్ల అమలుకు న్యాయపరమైన అంశాలు అడ్డంకిగా మారకుండా.. ముందుగా సమగ్ర అధ్యయనం చేయాలని నిర్ణయించింది.

ఎందుకు డెడికేటెడ్ కమిషన్?

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించేందుకు కేవలం జనాభా లెక్కలు సరిపోవు. బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులతో పాటు.. స్థానిక సంస్థల్లో వారి రాజకీయ ప్రాతినిధ్యం, వెనుకబాటుతనాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసి.. రాష్ట్రవ్యాప్తంగా వివరాలను సేకరించి అధ్యయనం చేయించారు.

రాజీవ్ రంజన్ మిశ్రా కసరత్తు

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటైన ఏకసభ్య కమిషన్.. జిల్లాల వారీగా పర్యటించింది. బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, ఇతర వర్గాలతో సంప్రదింపులు జరిపింది. బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులు.. స్థానిక సంస్థల్లో వారి ప్రాతినిధ్యం.. రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై వివరాలు సేకరించింది.

ఇప్పుడు ప్రభుత్వం ముందున్న పని

కమిషన్ నివేదిక ఇప్పుడు ప్రభుత్వానికి చేరింది. బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్‌ కల్పించాలి.. ఏ విధంగా అమలు చేయాలి.. స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్లను ఎలా ఖరారు చేయాలి.. అన్న అంశాల్లో కమిషన్ చేసిన సిఫార్సులు ఇప్పుడు కీలకం కానున్నాయి. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది.

ఎన్నికలకు ముందు కీలక అడుగు

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో బీసీ రిజర్వేషన్లపై కమిషన్ నివేదిక రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల హామీని అమలు చేయడంతో పాటు.. రిజర్వేషన్ల విషయంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us