ఏపీలో రేషన్ డోర్ డెలివరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. సరుకుల పంపిణీకి సిద్ధమవుతున్న సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్

|

Feb 15, 2021 | 5:16 PM

ఏపీలో రేషన్‌ డోర్‌ డెలివరీకి హైకోర్టు అనుమతినిచ్చింది. ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు.

ఏపీలో రేషన్ డోర్ డెలివరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్..  సరుకుల పంపిణీకి సిద్ధమవుతున్న సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్
Follow us on

Ration Door Delivery : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేసేందకు ఏపీ హైకోర్టు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ వాహనాల రంగును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) ఆదేశాలను హైకోర్టు స్టే విధించింది. ఈ విషయం తదుపరి విచారణకు వచ్చే మార్చి 15 వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని హైకోర్టు తెలిపింది.

ఏపీలో రేషన్‌ డోర్‌ డెలివరీకి హైకోర్టు అనుమతినిచ్చింది. ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. హైకోర్టు ఆదేశాలతో రేషన్ డోర్ డెలివరీకి రెడీ అవుతోంది ఏపీ సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్. వాహనాల ద్వారా రేషన్ డోర్‌ డెలివరీ చేసే ఏర్పాట్లు మొదలు పెట్టింది. వాహన డ్రైవర్లు పౌర సరఫరాల శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
అయితే, పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామాలకు వెళ్లే రేషన్ వాహనాల రంగు మార్చాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలపై స్టే ఇచ్చింది. హైకోర్టు స్టే ఉత్తర్వులు మార్చ్ 15 వరకూ అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ వ్యవహారంపై 15 తర్వాత తదుపరి విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది. మార్చ్ 14 నాటికి మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికలు ముగియనున్నాయి.

ఇదిలావుంటే, పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైన తర్వాత.. రేషన్ డోర్‌డెలివరీని నిలిపివేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు. వాహనాలను పరిశీలించిన తర్వాత వాటి రంగు మార్చాలని సూచించారు. నిమ్మగడ్డ ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టుని ఆశ్రయించింది. రేషన్ పంపిణీ నిరంతర ప్రక్రియ అని.. తరచూ వాహనాల రంగు మార్చడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని పౌరసరఫరాల శాఖ కోర్టులో వాదించింది. దీనిపై విచారణ జరిపిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇవాళ స్టే విధించింది.

హైకోర్టు తాజా ఆదేశాలతో వెంటనే రేషన్ డోర్ డెలివరీకి పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాల్లో ఏర్పాట్లపై ఉన్నతాధికారులు సమీక్షించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో రేషన్ డోర్ డెలివరి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, కోడ్ కారణంగా.. ఈ కార్యక్రమాన్ని కేవలం అధికారులు మాత్రమే నిర్వహించనున్నారు. ప్రజా ప్రతినిధులు పాల్గొనడానికి అవకాశం లేదు.

Read Also… కొత్త పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల ముమ్మర కసరత్తు.. ముఖ్యనేతల భేటీతో సందడిగా మారిన లోటస్‌పాండ్‌