
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డ్, రేషన్ కార్డుకు సంబంధించి కీలక ప్రకటన జారీ చేసింది. ఇక నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాయితీ, సేవలతో పాటు ఇతర ప్రయోజనాలు పొందేందుకు ఈ రెండు గుర్తింపు ధృవీకరణ పత్రాలను నివాస రుజువుగా ఉపయోగించుకోవాలని సూచించింది. రెసిడెన్షియల్ సర్టిఫికేట్కు సంబంధించి బుధవారం ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సర్టిఫికేట్లను జారీ చేసే బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించింది. గతంలో తహసీల్దార్లను ఆ బాధ్యతల నుంచి తప్పించగా.. ఇప్పుడు మళ్లీ వారికి అధికారం అప్పగించింది. అయితే ఇప్పుడు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది.
కేవలం ఆదివాసీ గిరిజనులకు ఆధార్ నమోదు, ఆధార్ అప్డేట్ కోసం తహసీల్దార్లు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ జారీ చేయాలని ప్రభుత్వం తెలిపింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, సైనిక దళాల రిక్రూట్మెంట్ అవసరాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అవసరం కోసం రెసిడెన్స్ సర్టిఫికేట్ అందించాలని ఆదేశించింది. మిగతా పనులకు ఆధార్, రేషన్ నివాస రుజువుగా సరిపోతుందని ప్రభుత్వం తెలిపింది. కేవలం నిర్దిష్ట అవసరాలకు మాత్రమే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ జారీ చేయాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తాజాజా సీఎస్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పటికే సర్టిఫికేట్లు జారీ చేసి ఉంటే మళ్లీ కొత్తగా అవసరం లేదని స్పష్టం చేసింది.
రెసిడెన్షియల్ సర్టిఫికేట్ల జారీని తహసీల్దార్కు అప్పగిస్తూ జీవో నెంబర్ 592ను ప్రభుత్వం విడుదల చేసింది. 2015లో తెచ్చిన జీవో 581ను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి తహసీల్దార్కు రెసిడెన్స్ సర్టిఫికేట్ జారీ చేసే అధికారాన్ని అప్పగించింది. ఇక నుంచి ఎవరికైనా నివాస ధృవీకరణ పత్రం అవసరమైతే తహసీల్దార్కు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. తహసీల్దార్ డాక్యుమెంట్లు పరిశీలించి సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఒకవేళ సరైన ఆధారాలు లేకపోతే స్థానికంగా విచారణ జరిపిన అనంతరం రెసిడెన్స్ సర్టిఫికేట్ జారీ చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఏపీలో సర్ ప్రక్రియ ముగియడం, రేషన్, ఆధార్ కార్డు ఆధారంగా నివాస రుజువును ధృవీకరిస్తున్న తరుణంలో రెసిడెన్స్ సర్టిఫికేట్లతో పని లేకుండా పోయింది. ఇప్పుడు ఆ బాధ్యతలను తిరిగి తహసీల్దార్లకు అప్పగించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మళ్లీ తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందేమోని భయపడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆధార్, రేషన్ కార్డును నివాస రుజువుగా ఉపయోగించుకోవచ్చని ప్రకటన చేయడంతో ఊరట చెందుతున్నారు.