AP Government: ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి మధ్య బిగ్ వార్.. గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ వార్నింగ్ నోటీస్..

|

Jan 24, 2023 | 12:20 PM

ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఏపీ ప్రభుత్వం సంజాయిషీ నోటీసు జారీ చేయడం ఉద్యోగ వర్గాల్లో కలకలంగా మారింది. గుర్తింపు ఉద్యోగ సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని కోరుతూ నోటీసులు ఇవ్వడం ఇదే మొదటిసారి.

AP Government: ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి మధ్య బిగ్ వార్.. గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ వార్నింగ్ నోటీస్..
Ap Employees Union
Follow us on

ఏపీలో మరో చర్చ మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం సంజాయిషీ నోటీసు జారీ చేయడం పెద్ద సంచలనంగా మారింది. గుర్తింపు ఉద్యోగ సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని కోరడం ఇదే తొలి సారి. గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుబట్టడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరుపై ఉద్యోగం సంఘం నాయకులు మండిపడుతున్నారు. ఆర్థిక ప్రయోజనాలపై గతంలో ఎన్నో వినతులు ఇచ్చినా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు గవర్నర్‌ను కలవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లుగా ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్యోగ సంఘాల గుర్తింపు నియమావళి ఉల్లంఘనగా పరిగణించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందేలా చట్టం చేయాలని కోరుతూ గవర్నర్‌కు వినతి పత్రం ఇచ్చాయి ఉద్యోగ సంఘాలు. ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడడంపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగ సంఘాల గుర్తింపు నియమావళిని ఉల్లంఘించినందున సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో తెలపాలన నోటీసులో కోరింది ప్రభుత్వం.

గవర్నర్‌ను కలవడాన్ని నేరుగా నోటీసుల్లో ప్రస్తావించకపోయినా వేతనాలు, ఆర్థిక ప్రయోజనాలపై చర్చించేందుకు ప్రభుత్వంలో ప్రత్యామ్నాయ వ్యవస్థలు ఉండగా వాటిని కాదని వేరే రకంగా ప్రయత్నాలు చేశారని పేర్కొంది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వంపైనా మీడియాతో మాట్లాడారని నోటీసుల్లో ప్రస్తావించింది. మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది.

అసలు ఏం జరిగిందంటే..

ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతభత్యాలు ఇచ్చేందుకు చట్టం చేయాలని.. ఈ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వినతి పత్రం సమర్పించారు. ఉద్యోగులకు అందించాల్సిన ప్రయోజనాల విషయంలో  రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతోందని వినతి పత్రంలో ప్రస్తావించారు.

ఉద్యోగుల సమస్యలపై గవర్నర్‌ను కలవడం.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం సోమవారం సంజాయిషీ నోటీసులు జారీ చేసింది. తమకు నోటీసులు అందాయని, వీటికి సమాధానం ఇస్తామని తనను కలిసిన మీడియాతో సూర్యనారాయణ తెలిపారు.

అయితే, తమకు ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇస్తామని తెలిపారు. మీడియాతో మాట్లాడడం నేరమైతే ఇది అన్ని సంఘాలకూ వర్తిస్తుంది. నిబంధనలకు లోబడే వ్యవహరించామని.. సంబంధిత అధికారులకు ఏ ఏ తేదీల్లో దరఖాస్తులు ఇచ్చామో చెబుతామన్నారు. తమ డిమాండ్లపై అధికారుల నుంచి సమాధానం లేకపోవడంతోనే గవర్నర్‌ను కలిశామని వివరించారు సూర్యనారాయణ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం