
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఐకానిక్ మోటార్సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్, తన భారీ మెగా ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. సుమారు రూ. 2,200 కోట్ల పెట్టుబడితో తిరుపతి జిల్లా సత్యవేడులో ఈ తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతున్నారు. 1901లో సంస్థ ప్రారంభమైన తర్వాత, తమిళనాడు వెలుపల ఇంతటి భారీ స్థాయిలో ప్లాంట్ను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్లాంట్ ద్వారా కేవలం మోటార్సైకిళ్ల తయారీ మాత్రమే కాకుండా, ఒక భారీ వెండర్ పార్క్ కూడా అభివృద్ధి చెందనుంది. దీనివల్ల రాయల్ ఎన్ఫీల్డ్కు విడిభాగాలు సరఫరా చేసే అనుబంధ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్కు తరలి రానున్నాయి. ఇది సత్యవేడును ప్రపంచ స్థాయి ఆటోమొబైల్ క్లస్టర్గా మార్చనుంది.
ఈ ప్లాంట్ ప్రారంభం కావడంతో రాయల్ ఎన్ఫీల్డ్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 9 లక్షల యూనిట్లు పెరగనుంది. దీంతో దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ ఎగుమతులలో కూడా సంస్థ మరింత దూసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్టు కోసం సత్యవేడు మండలంలోని వన్నెలూరు గ్రామంలో 233.76 ఎకరాలు, రాళ్ళకుప్పం గ్రామంలో 42.38 ఎకరాలు కలిపి మొత్తం 267 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
మొదటి దశలో ప్రధాన తయారీ యూనిట్తో పాటు ప్రత్యేక వెండర్ పార్క్ను కూడా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల రాయల్ ఎన్ఫీల్డ్కు అనుబంధంగా ఉన్న సరఫరాదారులు, భాగాల తయారీ సంస్థలు కూడా ఏపీకి తరలివచ్చే అవకాశముంది. దీని ఫలితంగా సత్యవేడు ప్రాంతం భవిష్యత్తులో ప్రపంచ స్థాయి ఆటోమొబైల్ తయారీ క్లస్టర్గా రూపుదిద్దుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రాజెక్టు తొలి దశను 2029 నాటికి, రెండో దశను 2032 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీర్ఘకాలిక పారిశ్రామిక వ్యూహంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది కీలక ఫలితంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విస్తరణతో రాయల్ ఎన్ఫీల్డ్ తన దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ ఎగుమతులను కూడా గణనీయంగా పెంచుకోనుంది.”రాయల్ ఎన్ఫీల్డ్ వంటి గ్లోబల్ బ్రాండ్ ఏపీని ఎంచుకోవడం రాష్ట్ర వ్యాపార అనుకూల వాతావరణానికి నిదర్శనం. ఇది రాష్ట్రాన్ని అడ్వాన్స్డ్ మానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతుంది” అని ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
దక్షిణ ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామికంగా మరో మెట్టు ఎక్కించే ఈ ప్రాజెక్టు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలవనుంది. కియా మోటార్స్ తర్వాత ఆటోమొబైల్ రంగంలో ఏపీ సాధించిన మరో అతిపెద్ద విజయం ఇది. సత్యవేడు కేంద్రంగా రాయల్ ఎన్ఫీల్డ్ చేసే ప్రయాణం ఏపీ పారిశ్రామిక భవిష్యత్తును సరికొత్త శిఖరాలకు చేరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..