
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఇటీవల భుజానికి శస్త్ర చికిత్స జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే మంత్రి హోదాలో ఉన్నందున ఈ చికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వ నిధుల నుంచి పొందే (మెడికల్ రీఎంబర్స్మెంట్) అవకాశం ఉన్నప్పటికీ, ఆయన ఆ వెసులుబాటును తిరస్కరించారు. శస్త్ర చికిత్స, ఆస్పత్రి ఖర్చులతో పాటు ప్రయాణ వ్యయాన్ని కూడా పూర్తిగా తన సొంత నిధులతోనే భరిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మంత్రి పదవిలో ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు వస్తే చికిత్స ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ప్రజాధనాన్ని తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదనే స్వీయ నిబంధనకు కట్టుబడి పవన్ కళ్యాణ్ తన వైద్య ఖర్చులు తానే భరించనున్నట్టు తెలిపారు. గతంలో ఆయనకు ముక్కుకు శస్త్ర చికిత్స జరిగిన సమయంలోనూ ఇదే విధానాన్ని అవలంబించి, వైద్య ఖర్చులన్నింటినీ స్వయంగా ఆయనే భరించారు. ఇప్పుడు భుజం సర్జరీకి కూడా అదే నిర్ణయాన్ని కొనసాగించారు.
వైద్య ఖర్చులపై వస్తున్న వివిధ చర్చలకు తెరదించుతూ పవన్ కళ్యాణ్ కార్యాలయం ఈ వివరాలను స్పష్టం చేసింది. ప్రస్తుతం శస్త్ర చికిత్స అనంతరం ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పవన్ కల్యాణ్ హైదరాబాద్ బయల్దేరారు. ఇక్కడి వచ్చిన రెండు వారాల తర్వాత ఆయన వైద్యుల సూచన మేరకు ఫిజియోథెరపీ ట్రట్మెంట్ తీసుకోనున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని జనసేన వర్గాలు తెలిపాయి. వ్యక్తిగత వైద్య ఖర్చులను ప్రభుత్వంపై మోపకుండా సొంతంగా భరించడంపై రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.