AP News: ఏపీలో లిక్కర్ ప్రియులకు గుడ్‌న్యూస్.. అక్కడి కంటే తక్కువ ధరకే మద్యం

|

Sep 15, 2024 | 12:37 PM

మందుబాబులకు ఏపీ సర్కార్‌ త్వరలోనే గుడ్‌న్యూస్‌ చెప్పనుంది. ఇన్నాళ్లు మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతున్న వారికి బిగ్ రిలీఫ్ దక్కనుంది. ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్‌ ఉంది.

AP News: ఏపీలో లిక్కర్ ప్రియులకు గుడ్‌న్యూస్.. అక్కడి కంటే తక్కువ ధరకే మద్యం
Andhra New Liquor Policy
Follow us on

ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది. 2019 కంటే ముందు రాష్ట్రంలో అమలులో ఉన్న లిక్కర్ పాలసీనే తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మద్యం పాలసీ అమల్లోకి వస్తే మందు బాబులకు రిలీఫ్ దక్కనుంది. అటు ఎన్నికల సమయంలోనూ తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు ప్రకటించారు.కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి వస్తే..మద్యం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కంటే తక్కువగా మద్యం ధరలు ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న లిక్కర్‌ పాలసీని అధ్యయనం చేసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అక్టోబర్‌ 1నుంచి కొత్త మద్యం విధానం

అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న మద్యం పాలసీ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త లిక్కర్‌ పాలసీపై కూటమి ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. అతి త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

లిక్కర్‌ నూతన పాలసీపై కేబినెట్‌ సబ్‌కమిటీ భేటీ

లిక్కర్‌ నూతన పాలసీపై కేబినెట్‌ సబ్‌కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమైంది. సబ్‌కమిటీలో మంత్రులు కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, నాదెండ్ల మనోహర్‌, కొండపల్లి శ్రీనివాస్‌, సత్యకుమార్‌లు ఉన్నారు. ఈనెల 17వ తేదీన మరోసారి కేబినెట్‌ సబ్‌కమిటీ ఆఖరి సమావేశం జరగనుంది. ఏయే ప్రాంతంలో ఎన్ని మద్యం దుకాణాలు నోటిఫై చేయాలి? దరఖాస్తు రుసుములు, నాన్‌ రిఫండబుల్‌ ఛార్జీలు, లైసెన్స్‌ రుసుములు ఎలా ఉండాలి? వంటి అంశాలపై అధికారులు సమర్పించిన ప్రతిపాదనలను గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ పరిశీలించారు. వినియోగదారులు కోరుకునే అన్ని బ్రాండ్లూ అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఇక ఈ నెల 18న జరిగే కేబినెట్‌ భేటీలో కొత్త లిక్కర్‌ పాలసీ ప్రతిపాదనలను ఉంచాలని సబ్‌కమిటీ నిర్ణయించింది. కేబినెట్‌ ఆమోదం తర్వాత కొత్త పాలసీని ప్రకటించే అవకాశం ఉంది.

గత ప్రభుత్వం మద్యం విధానాన్ని పూర్తిగా అస్తవ్యస్తంగా చేసిందని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. సొంత ఆదాయం పెంచుకునేందుకే మద్యం విధానం రూపొందించారని ఆరోపించింది. గత ప్రభుత్వ మద్యం విధానం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్నదని..అందుకోసమే కొత్త లిక్కర్‌ పాలసీ ఏర్పాటు చేస్తున్నామని కూటమి నేతలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.