AP Rains: ఏపీ ప్రజలకు హెచ్చరిక.. ముంచుకొస్తున్న మరో తుఫాన్.. మూడు రోజులు అప్రమత్తత అవసరం!

|

Dec 13, 2022 | 6:17 PM

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో తుఫాన్ ముంచుకొస్తోందని హెచ్చరిస్తోంది..

AP Rains: ఏపీ ప్రజలకు హెచ్చరిక.. ముంచుకొస్తున్న మరో తుఫాన్.. మూడు రోజులు అప్రమత్తత అవసరం!
Ap Rains
Follow us on

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో తుఫాన్ ముంచుకొస్తోందని హెచ్చరిస్తోంది. ఇప్పటికే మండూస్ తుఫాన్ ఎఫెక్ట్‌తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ ప్రాంతంలో మంగళవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ఆ తర్వాత క్రమంగా బలపడి అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది. ఇది ఈ నెల 16వ తేదీ తర్వాత తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో తూర్పు/ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:–
————————————————–

  • ఈరోజు, రేపు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
  • ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
———————————-

  • ఈరోజు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకట్రెండు ప్రాంతాల్లో సంభవించే అవకాశం ఉంది.
  • రేపు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
  • ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రాయలసీమ:-
——————-

  • ఈరోజు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. అటు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
  • రేపు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
  • ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

కాగా, మరోమారు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అటు శ్రీలంకను ఆనుకుని ఉన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా ఈ నెల 16వ తేదీ వరకు రాష్ట్రంలోని డెల్టా జిల్లాలలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తమిళనాడులోని మామల్లపురంలో ఆదివారం రాత్రి మాండూస్ తుఫాను తీరం దాటడంతో తమిళనాడు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా కెవిబిపురం మండలంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. చెన్నైలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడగా, విపరీతంగా వీస్తున్న ఈదురు గాలులు వల్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి.