
అమరావతి, ఫిబ్రవరి 10: ఏపీ రాజధాని అమరావతిలో దేశంలోనే తొలి ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకో సిస్టమ్, శిక్షణ కేంద్రాల అభివృద్ధి కోసం ఐటీ శాఖ తాజాగా జీవో జారీ చేసింది. ఎని విడియా (Nvidia) సహకారంతో ‘ఏఐ లివింగ్ ల్యాబ్స్’ పేరుతో ఈ వర్సిటీని నెలకొల్పుతున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచే దీని కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. అంతర్జాతీయ సంస్థ ఎన్విడియా (ఎన్వీఐడీఐఏ) కార్పొరేషన్తో ఐటీ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ మేరకు కృత్రిమ మేధ (ఏఐ) యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ఐటీ, ఎలకాట్రనిక్స్ శాఖ తాజాగా జీవో జారీ చేసింది. ఏఐ ఎకో సిస్టమ్, మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు వీలుగా కంపెనీల చట్టం 2013 సెక్షన్ 8 కింద లాభాపేక్ష లేని కంపెనీగా జీవోలో పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా మెమొరాండమ్ జారీ చేసింది. మరోవైపు ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటులో ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఎన్విడియా (Nvidia) కీలక భాగస్వామిగా వ్యవహరించింది. గతంలోనే ఏఐ లివింగ్ ల్యాబ్స్ పేరుతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ద్వారా విద్యార్థులకు మరియు పరిశోధకులకు నేరుగా అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది.
ఈ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉంటుంది. అక్కడి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. నిర్ణీత గడువులోగా ఇది కార్యరూపం దాల్చితే దేశంలోనే తొలి ఏఐ యూనివర్సిటీగా అమరావతి చరిత్ర సృష్టించనుంది. ఇది కేవలం విద్యకు మాత్రమే పరిమితం కాకుండా, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, తయారీ, ఫిన్టెక్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి స్టార్టప్లకు ఊతం ఇవ్వనుంది. ప్రభుత్వ పాలనలో ఏఐ సాంకేతికతను ఎలా వాడాలి అనే అంశాలపై కూడా దృష్టి సారిస్తుంది. .
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.