
జబ్బు వచ్చిందంటే చాలు.. కార్పొరేట్ ఆసుపత్రుల బాట పట్టాల్సిందే.. ఒక్కో పరీక్షకు వేల రూపాయలు… రిపోర్టుల కోసం రోజుల తరబడి ఎదురుచూపులు.. కానీ ఇప్పుడు ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ఒక్క రక్తపు చుక్కతోనే 45 రకాల అత్యాధునిక పరీక్షలు.. అదీ పూర్తిగా ఉచితం.. క్యాన్సర్ మానిటరింగ్ టెస్టులు కూడా పైసా ఖర్చు లేకుండా అదే రోజు రాత్రికి రిపోర్ట్ నేరుగా మీ మొబైల్కు.. విజయవాడలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ డిజిటల్ డయాగ్నస్టిక్ హబ్ ఇప్పుడు నాలుగు జిల్లాల ప్రజలకు వరంగా మారింది..
అనారోగ్యం వస్తే ముందుగా గుర్తొచ్చేది ఆసుపత్రి కాదు.. ఖర్చు.. పరీక్షల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేసే కార్పొరేట్ ల్యాబ్లకు ప్రత్యామ్నాయంగా పేదలు, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం విజయవాడలో అత్యాధునిక సిటీ డయాగ్నస్టిక్ హబ్ను ఏర్పాటు చేసింది. ఒక్క బ్లడ్ శాంపిల్తోనే 45 రకాల రక్త పరీక్షలు ఇక్కడ పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో లేని అత్యంత ఖరీదైన క్యాన్సర్ మానిటరింగ్ పరీక్షలు కూడా ఇక్కడే చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా కేంద్రంగా పనిచేస్తున్న ఈ హబ్కు కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని దాదాపు 42 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల నుంచి ప్రతిరోజూ శాంపిల్స్ వస్తున్నాయి. ఉదయం పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో సేకరించిన రక్త నమూనాలను ప్రత్యేక వాహనాల ద్వారా మధ్యాహ్నం ఈ ల్యాబ్కు తీసుకొస్తారు. అత్యాధునిక యంత్రాలతో పరీక్షలు పూర్తి చేసి అదే రోజు రాత్రి 9 గంటలలోపు రోగి వాట్సాప్కు పీడీఎఫ్ రూపంలో రిపోర్ట్ పంపిస్తున్నారు. సాధారణంగా ప్రైవేట్ ల్యాబ్లలో ఈ పరీక్షలు చేయించుకోవాలంటే… ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. కానీ ఈ ప్రభుత్వ కేంద్రంలో ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. CA-19.9, CA-125, AFP, CEA వంటి ఖరీదైన క్యాన్సర్ మార్కర్ పరీక్షలను కూడా ఉచితంగా చేస్తున్నారు. క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న రోగుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడంలో ఇవి కీలకంగా ఉపయోగపడుతున్నాయి