
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. 14 జిల్లాల పరిధిలోని 110 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇందులో ముఖ్యంగా పల్నాడు 16, ప్రకాశం 15, బాపట్ల 13, ఎన్టీఆర్ 12, కృష్ణా 12, గుంటూరు12, ఏలూరు 6, మార్కాపురం 6, నెల్లూరు 6 మండలాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా చూపించింది.
గురువారంనాడు మార్కాపురం(జి) నందనమారెళ్లలో 45.2డిగ్రీలు, ఏలూరు(జి) ధర్మాజీగూడెంలో 45, కృష్ణా(జి) కంకిపాడు, ప్రకాశం(జి) సంతనూతలపాడులో 44.6, తూర్పుగోదావరి(జి) బ్రాహ్మణగూడెం, ఎన్టీఆర్(జి) తొర్రగుడిపాడులో 44.4, పల్నాడు(జిల్లా) నూజెండ్లలో 44.1, గుంటూరు(జి) పాండ్రపాడులో 44, బాపట్ల(జి) మార్టూరు, నెల్లూరు(జి) గూడూరులో 43.8, పోలవరం(జి) చింతూరులో 43.6, తిరుపతి(జి) వెంకటగిరిలో 43, చిత్తూరు(జి) నిండ్ర, విశాఖ(జి) ములగాడలో 42 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి.
శుక్రవారంనాడు 79 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 152 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నమోదైయ్యే మండలాల పూర్తి వివరాలు లింక్లో: Link
▪️ విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం,కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 45 – 46 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
▪️శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 – 44 డీగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.
▪️కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 40 – 42 డీగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
🔸జార్ఖండ్ నుండి ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. దీనిప్రభావంతో శనివారంనాడు మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, హోర్డింగ్స్ క్రింద నిలబడొద్దని సూచించారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.