Andhra Pradesh: విశాఖపట్నం రింగ్ నెట్స్ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. వివాదం తీవ్రమవడం, బోట్లు, వలలు తగలబెట్టడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో రింగ్ నెట్స్ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖ జాలరిపేటల్లో చోటుచేసుకున్న ఘటనలు సమీక్షించారు. ఈ భేటీలో విశాఖ జిల్లా కలెక్టర్, డీసీపీతో పాటు మత్స్యశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీకి సంప్రదాయ మత్స్యకారులు, రింగ్ వలలతో చేపలు పట్టే మత్స్యకారులను కూడా పిలిచారు. రింగ్ నెట్స్ ఉపయోగించేందుకు లైసెన్స్లు కలిగిన పడవలను మాత్రమే అనుమతించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే నిర్దేశించుకున్న సరిహద్దులను అతిక్రమించవద్దని మంత్రులు, అధికారులు మత్స్యకారులకు సూచించారు. ఇందు కోసం అవసరమైన పర్యవేక్షణ చేపట్టాలని పోలీసులు, మత్స్యశాఖ అధికారులను మంత్రులు ఆదేశించారు.
మరోవైపు ఘర్షణలకు తావులేకుండా మత్స్యకారులు వ్యవహరించాలని కోరారు మంత్రి అప్పలరాజు. సంప్రదాయ మత్స్యకారులు, రింగ్ వలల మత్స్యకారుల మధ్య తలెత్తిన వివాదం కారణంగా విశాఖ తీరానికి సమీపంలో లంగర్ వేసిన 6 తెప్పలు, 4 వలలు తగులబడిపోయాయి. విశాఖ తీరంలోని జాలరిపేట, ఎండాడ జాలరిపేట వాసుల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పరిస్థితి మరింత తీవ్రం కాకుండా చూసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారుర. సదరు గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. వాస్తవానికి విశాఖ తీరంలో రింగ్ నెట్స్ ఉపయోగించే చేపలు వేటాడేందుకు 8 బోట్లకు మాత్రమే అనుమతి ఉంది. రింగ్ నెట్స్ ఉపయోగించే పడవలు తీరానికి 8 కిలోమీటర్ల తర్వాతే చేపలు పట్టాల్సి ఉంటుంది. కాని ఆ పడవలు 8 కిలోమీటర్ల లోపు చేపలు పడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. తాజా ఘర్షణలు ఇదే కారణమని తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..